అమెరికా పెంటగాన్లో తుపాకీ మోతలు.. లాక్డౌన్ చేసిన అధికారులు
ABN , First Publish Date - 2021-08-04T05:15:51+05:30 IST
అమెరికా రక్షణ ప్రధాన కార్యాలయం పెంటగాన్లో కాల్పుల మోత అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇక్కడి మెట్రో
వాషింగ్టన్: అమెరికా రక్షణ ప్రధాన కార్యాలయం పెంటగాన్లో కాల్పుల మోత అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇక్కడి మెట్రో స్టేషన్ సమీపంలోని బస్ ప్లాట్ఫాం దగ్గర తుపాకీ మోతలు వినిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పెంటగాన్ను లాక్డౌన్ చేశారు. పెంటగాన్ ట్రాన్సిట్ సెంటర్లో భాగమైన బస్ ప్లాట్ఫాం వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలు ఈ ప్రాంతానికి సాధ్యమైనంత వరకూ రావొద్దని అధికారులు హెచ్చరించారు. కొంతసేపు పెంటగాన్ను లాక్డౌన్ చేసిన తర్వాత మళ్లీ తెరిచారు. అయితే ఈ ప్రాంతాన్ని ఇంకా క్రైం సీన్గానే పరిగణిస్తున్నామని, ఒక అధికారి ట్వీట్ చేశారు. ఇక్కడి ఆర్లింగ్టన్ కౌంటీ అగ్నిమాపక శాఖ పలువురు పేషెంట్లు ఉన్నట్లు తెలిపింది. అయితే వీరికి అయిన గాయాలు తుపాకీతో కాల్చడం వల్ల తగిలాయా? లేదా? అనే విషయాన్ని అధికారులు చెప్పలేదు. అలాగే గాయాల తీవ్రతను కూడా వెల్లడించలేదు.