అత్యంత నివాసయోగ్యం.. కాకినాడ!
ABN , First Publish Date - 2021-03-05T06:48:28+05:30 IST
పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలచుకునే కాకినాడ నగరం ప్రశాంతమైన జీవనానికి చక్కటి లోగిలిగా పేరుంది. ఇప్పుడు అదే మరోసారి రుజువైంది. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతాల్లో మిలియన్కంటే జనాభా ఉన్న నగరాల కేటగిరీలో టాప్టెన్ జాబితాలో నాలుగో స్థానం మన కాకినాడకు దక్కింది.
- దేశవ్యాప్త ర్యాంకింగ్లో నాలుగో స్థానం.. ప్రకటించిన కేంద్ర మంత్రి
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలచుకునే కాకినాడ నగరం ప్రశాంతమైన జీవనానికి చక్కటి లోగిలిగా పేరుంది. ఇప్పుడు అదే మరోసారి రుజువైంది. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతాల్లో మిలియన్కంటే జనాభా ఉన్న నగరాల కేటగిరీలో టాప్టెన్ జాబితాలో నాలుగో స్థానం మన కాకినాడకు దక్కింది. గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ మంత్రి హర్దీప్సింగ్ దేశంలో నివాసయోగ్యమైన నగరాల జాబితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన ఈ జాబితాల్లో స్మార్ట్సిటీ కాకినాడకు చోటుదక్కడం, అది కూడా మన రాష్ట్రంలో ఇదొక్కటే ఉండడం విశేషం. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉత్తరాఖండ్ రాజధాని సిమ్లా మొదటి స్థానంలో నిలవగా, రెండు మూడు స్థానాల్లో భుబనేశ్వర్, సిల్వాస్సాలకు చోటు దక్కింది. నాలుగో స్థానంలో కాకినాడ నిలిచింది. ప్లాన్డ్ సిటీగా రూపుదిద్దుకున్న కాకినాడ నగరంలో ప్రస్తుతం మునిసిపల్ డివిజన్లు 50 కాగా, జనాభా 3.60 లక్షల మంది. ఇక్కడ పేద, మధ్య తరగతి కుటుంబాల నివాసానికి అందుబాటులో అద్దెకు ఇళ్లు లభిస్తుండడం, వలస కార్మికులకు ఆశ్రయం కల్పిస్తూ వారి జీవనోపాదులకు కొండంత అండగా ఉండ డంతో అత్యధికులు ఇక్కడ నివాసం ఉంటున్నారని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ చేసిన సర్వేలో వెల్లడయ్యింది. దీంతో నగరానికి దేశవ్యాప్తంగా పేరు లభించింది. కాకినాడ నగరంలో 101 లోతట్టు ప్రాం తాలు, 70 మధ్యతరగతి ప్రజలు నివసించే కాలనీలు, ఎగువతరగతి ప్రజలు జీవించే 45 ప్రాంతాలు ఒక క్రమపద్ధతిలో ఏర్పడడంతో నగరానికి మొదట నుంచి ప్లాన్డ్ సిటీ అని పేరు ఉంది. ఈ క్రమంలో నగరం స్మార్ట్ సిటీ సంతరించుకోవడంతో అభివృద్ధిలో పయనిస్తోంది.