ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ABN , First Publish Date - 2021-12-03T05:04:31+05:30 IST
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీలు ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గఫార్ చెప్పారు.
సీపీఎం జిల్లా మహాసభలో మాజీ ఎమ్మెల్యే గఫార్
మార్కాపురం, డిసెంబరు 2 : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీలు ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గఫార్ చెప్పారు. స్థానిక ఎస్వీకేపీ కళాశాలలోని సూరా అంకిరెడ్డి ప్రాంగణంలో సీపీఎం ప్రకాశం జిల్లా 13వ మహాసభలు పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ అధ్యక్షతన గురువారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా పాలొన్న గఫార్ మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం మోదీ చేసిన నోట్లను రద్దు ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం శూన్యమన్నారు. నల్లధనం బయటకు తీస్తామని చెప్పిన మోదీ పాతనోట్ల బదులు కొత్త నోట్లను ముద్రించేందుకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. కరోనా కాలంలో ప్రజలకు చేసిన సాయం శూన్యమన్నారు. ఇతర దేశాలలో లాక్డౌన్ సమయంలో ప్రతి పౌరుడికి నగదు సహాయం చేయడంతో కొంతమేర ఉపసమయం కలిగిందని చెప్పారు. మన దేశంలో కేవలం 5 కిలోల బియ్యంతో సరిపెట్టారన్నారు. కరోనా కాలంలో కార్పొరేట్లకు మరింత ఆదాయం చేకూరేలా మోదీ చర్యలు తీసుకున్నారని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను విదేశీ కంపెనీకి రూ.12 వేల కోట్లకు అమ్మబోతున్నారన్నారు. స్విస్ బ్యాంక్లలో నల్లధనాన్ని భారత్కు తీసుకువస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడేమి చేశారో ప్రజలు గ్రహించాలని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు దాన్ని వదిలేసి మోదీకి వంతుపాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులెవరైనా సమస్యలను చెప్పాలన్నా కలిసే అవకాశం లేదన్నారు.