అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం
ABN , First Publish Date - 2022-09-03T06:50:04+05:30 IST
అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీపీ బండ మల్లేశం అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది.
వేములవాడ రూరల్, సెప్టెంబరు 2: అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీపీ బండ మల్లేశం అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. సమావేశంలో అధికారులను సర్పంచులు, ఎంపీటీసీలు నిలదీశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు. ఫాజుల్నగర్ ఎంపీపీఎస్ను కూల్చివేసేందుకు రూ.4లక్షల నిధులు కేటాయించామని మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మరో రూ.9 లక్షల నిధులు మంజూరైనప్పటికీ అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదని, మల్లారం రాజానగర్లో మండల పరిషత్ నిధుల నుంచి ఎంపీపీఎస్ విద్యార్థులకు అవసరమయ్యే పరికరాల కోసం రూ.2 లక్షల నిధులు కేటాయించినప్పటికీ ఎందుకు ముందుకు రావడంలేదని మండల విద్యాధికారిని ఎంపీపీ ప్రశ్నించారు. బాలరాజుపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ ఎస్లో టాయిలెట్స్లేక విద్యార్థులు పాఠశాల బయటకు వెళ్లడంతో పాఠశాల ఆవరణలో ఉన్న రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. సెస్ అధికారులు పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారని కనీసం ఫోన్లో వారిని సంప్రదించాలన్నా అందుబాటులోకి రావడంలేదని, గ్రామాల్లో ఎక్కడిపనులు అక్కడే ఉన్నాయని సెస్ అధికారులపై సర్పంచులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో పనులు ముందుకు సాగడం లేదని, హెల్పర్ను మార్చాలని మల్లారం సర్పంచ్ తిరుపతి సెస్ అధికారికి దండం పెట్టి వేడుకున్నారు. అధికారులు ప్రతీ సర్వసభ్య సమావేశానికి మొక్కుబడిగా వస్తున్నారని, ప్రగతి నివేదికలు చదివి వినిపించి నామ మాత్రంగా సమావేశాన్ని ముగిస్తున్నారని నూకలమర్రి సర్పంచ్ పెడ్యాల తిరుపతి అసహనం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఏశ వాణితిరుపతి, ఎంపీడీవో రాంరెడ్డి, పంచాయతీరాజ్ డీఈ శశికర్, ఆర్డబ్ల్యూఎస్ కె.శ్రీనివాస్, గ్రిడ్ డీఈ నవీన్ పలువురు సర్పంచులు, ఎంపీ టీసీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.