లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-08-01T06:08:30+05:30 IST
కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో నదీ తీర గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి అన్నారు.
నదీ తీర గ్రామాలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఆర్డీవో ఖాజావలి
మోపిదేవి, జూలై 31 : కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో నదీ తీర గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి అన్నారు. మోపిదేవి మండలంలో శనివారం వరద ప్రభావిత ప్రాంతాలైన బొబ్బర్లంక, కె.కొత్తపాలెం, మోపిదేవివార్పుల్లో పర్యటిం చారు. కృష్ణానది ప్రాంతాన్ని పరిశీలించి అధికారులు ప్రజలకు వరద పరిస్థితిని వివరించారు. ఆదివారం మధ్యాహ్నం 5 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రకాశం బ్యారేజీ నుంచి వస్తుందని, నదీ, లంకల్లోకి ఏ ఒక్కరూ వెళ్లకుండా చూడాల్సిందిగా రెవెన్యూ ఉద్యోగులను ఆదేశిం చారు. లంక ప్రాంతాల్లో ఉన్న పశువులు, కాపరులను వెం టనే సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఠాంఠాం ద్వారా తెలియజేయాల్సిందిగా సచివాలయ ఉద్యోగులకు తెలిపారు. తహసీల్దార్ కె.మస్తాన్, ఆయా గ్రామాల సర్పంచ్లు కొక్కిలిగడ్డ మాధవీ, దొప్పలపూడి గంగాఽభవాని, పంచాయతీ కార్యదర్శి సుజాత, వీఆర్వోలు నీలికాంత్, మల్లేశ్వరి, శ్రీనివాస్, మూర్తి పాల్గొన్నారు.
ఘంటసాల : కృష్ణానదికి 5 లక్షల వరద నీరు విడుదలవుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఖాజావలి సూచించారు. శ్రీకాకుళంలో ఉన్న కృష్ణానది ఘాట్ను పరిశీలించారు. శ్రీకాకుళం, పాపవినాశనం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.