చిక్కుల్లో కోహ్లీ ..
ABN , First Publish Date - 2020-08-01T08:40:40+05:30 IST
దేశ చట్టాల ప్రకారం గ్యాంబ్లింగ్ నేరమంటూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్తో టీమిండియా కెప్టెన్ కోహ్లీ చిక్కుల్లో...
ఆన్లైన్ గేమింగ్లపై కోర్టులో పిటిషన్
చెన్నై: దేశ చట్టాల ప్రకారం గ్యాంబ్లింగ్ నేరమంటూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్తో టీమిండియా కెప్టెన్ కోహ్లీ చిక్కుల్లో పడేలా ఉన్నాడు. ఆన్లైన్ గేమ్లు ఆడి భారీగా నష్టపోయిన గ్యాంబ్లర్లు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు తమిళనాడులో పెరిగిపోయాయంటూ సూర్యప్రకాశం అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆన్లైన్ గేమింగ్లకు ప్రచారకర్తలుగా ఉన్న కోహ్లీ, నటి తమన్నాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘గ్యాంబ్లింగ్ శిక్షార్హమైన నేరం. ఆన్లైన్ గేమ్ల నిర్వాహకులు భారీగా డబ్బు బోన్సలు ప్రకటిస్తుండడంతో యువత ఈ వ్యసనం బారిన పడుతున్నారు’ అని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ‘క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి తమన్నా భాటియా, ఇతర సినీ ప్రముఖులు ఈ ఆన్లైన్ గేమ్లు ఆడాల్సిందిగా బాగా ప్రచారం చేస్తున్నారు’ అని కూడా తెలిపారు. ‘గ్యాంబ్లింగ్ మహమ్మారి సమాజానికి ప్రమాదకరం. జీవించే హక్కును కాలరాస్తున్న ఈ గేమింగ్ రాజ్యాంగంలోని 21వ అధికరణకు విరుద్ధం. అందువల్ల ఈ గేమింగ్ను నిషేధించాలి. ఆ సైట్ల నిర్వాహకులను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి’ అని ఆ పిటిషన్లో కోరారు. చెన్నైకి చెందిన 19 ఏళ్ల విద్యార్థి ఇటీవల ఆత్మహత్య చేసుకుంటూ..గ్యాంబ్లింగ్కు బానిసై తాను ఈ చర్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్న విషయాన్ని పిటిషనర్ ప్రస్తావించారు. ఈ పిటిషన్ను హైకోర్టు వచ్చేవారం విచారణకు స్వీకరించే అవకాశముంది.