భర్త ఆచూకీ కోసం హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2020-10-01T15:02:10+05:30 IST
తన భర్త పోకల వెంకయ్యను తాడేపల్లి పోలీసులు బుధవారం తెల్లవారుజామున..
తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసిన పోలీసులు
తాడేపల్లి(గుంటూరు): తన భర్త పోకల వెంకయ్యను తాడేపల్లి పోలీసులు బుధవారం తెల్లవారుజామున అక్రమంగా విషయం చెప్పకుండా తీసుకువెళ్లారని, పోలీసుల వల్ల భయం ఉందని ఆరోపిస్తూ, కోర్టులో హాజరుపరచాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్డిపార్ట్మెంట్, డీజీపీ, ఎస్పీ, ఎస్హెచ్వో తాడేపల్లి అర్బన్, రూరల్ వారిని ప్రతివాదులుగా చేర్చి హైకోర్టులో తన న్యాయవాదుల ద్వారా వెంకయ్య భార్య కృష్ణప్రియ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలుచేసింది. తన భర్త, మరిదిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించింది.
ఈ లోగా వెంకయ్య సోదరుడు మార్కండేయులు ఓ సెల్ఫీవీడియోను విడుదల చేశాడు. తాడేపల్లి పోలీసుల వలన తనకు, తన అన్నకు ప్రాణహాని ఉందని ఆరోపించాడు. ఈ క్రమంలో వెంకయ్య మరికొందరిపై కేసులు ఉండడంతో వారిని, పోకల వెంకయ్యను విచారణ నిమిత్తం తీసుకువచ్చిన పోలీసులు బుధవారం సాయంత్రం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. పిటిషనర్ తరఫున హైకోర్టు న్యాయవాది ఉమేష్చంద్ర మాట్లాడుతూ పోలీసులు బైండోవర్ నిమిత్తం వెంకయ్యను తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకువచ్చినట్టు సమాచారం రావడంతో వచ్చినట్లు చెప్పారు. ఇదిలావుండగా సెల్ఫీవీడియో విడుదల చేసిన మార్కండేయులుపై కూడా పోలీసు స్టేషన్లో పలు కేసులు ఉన్నాయని, రౌడీషీటు ఉందని పోలీసులు చెబుతున్నారు.