పది రోజుల్లో పెట్రో ధర ఎంత పెరిగిందంటే...

ABN , First Publish Date - 2021-10-05T22:14:30+05:30 IST

దేశీయంగా జులై, ఆగస్టు నెలల్లో ముడి చమురు ధరలు ఊగిసలాటలో కనిపించినప్పటికీ... జులై 18 నుండి సెప్టెంబరు మధ్య వరకు చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలను పెంచలేదు.

పది రోజుల్లో పెట్రో ధర ఎంత పెరిగిందంటే...


న్యూఢిల్లీ : దేశీయంగా జులై, ఆగస్టు నెలల్లో ముడి చమురు ధరలు ఊగిసలాటలో కనిపించినప్పటికీ... జులై 18 నుండి సెప్టెంబరు మధ్య వరకు చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలను పెంచలేదు. అంతేకాదు... ఈ సమయంలో మొత్తంమీద లీటర్ పెట్రోలు రూ. 0.65, లీటర్ డీజిల్ పై రూ. 1.25 తగ్గించడం విశేషం. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గకపోవడంతో చమురు మార్కెటింగ్‌రంగ కంపెనీలు  పెట్రోల్, డీజిల్ రిటైల్‌ ధరలను వరుసగా పెంచుతున్నాయి. సెప్టెంబరు 24 నుండి డీజిల్ లీటర్ ధర రూ. 2.15 వరకు పెరగగా, గత వారం రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 1.25 వరకు పెరిగింది.


కాగా... అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ... చమురు కంపెనీలు మాత్రం రిటైల్ ధరల నిర్ణయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు బ్యారెల్‌కు 85.10 డాలర్ల నండి 87.11 డాలర్లకు ఒకరోజులోనే పెరిగాయి. డీజిల్ ధరలు బ్యారెల్‌కు 85.95 డాలర్ల నుండి 87.27 డాలర్లకు పెరిగాయి. ఇక... ఎల్‌పీజీ నెల రోజుల్లో టన్నుకు 655 డాలర్ల నుండి 797 డాలర్లకు పెరిగింది. అయితే... ఈ పెరుగుదలను చమురు కంపెనీలు వినియోగదారులకు బదలీ చేయలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం మధ్యస్తంగా మాత్రమే పెంచినట్లు చెబుతున్నారు.


కాగా, పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు(అక్టోబరు 5, మంగళవారం) పెరిగాయి. చమురు ధరలు నిన్న (సోమవారం, అక్టోబరు 4) స్థిరంగా ఉన్నాయి. మొన్నటివరకు ధరలు వరుసగా నాలుగు రోజుల పాటు పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్ పైన 25 పైసలు, లీటర్ డీజిల్ పైన 30 పైసలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు లీటర్ పెట్రోల్ పైన 25 పైసలు, లీటర్ డీజిల్ పైన 30 పైసలు పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు   ఆల్ టైమ్ గరిష్టం రూ.102ను దాటింది.

Updated Date - 2021-10-05T22:14:30+05:30 IST