Delta variant: భారత ప్రయాణికులపై నిషేధాన్ని పొడిగించిన మరో దేశం!

ABN , First Publish Date - 2021-08-13T17:28:04+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కల్లోలం సృష్టిస్తోంది. చాలా దేశాల్లో ప్రస్తుతం నమోదవుతున్న కొత్త కేసుల్లో సింహభాగం డెల్టాదే. ఈ నేపథ్యంలో పలు దేశాలు ఇప్పటికే ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

Delta variant: భారత ప్రయాణికులపై నిషేధాన్ని పొడిగించిన మరో దేశం!

మనీలా: ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కల్లోలం సృష్టిస్తోంది. చాలా దేశాల్లో ప్రస్తుతం నమోదవుతున్న కొత్త కేసుల్లో సింహభాగం డెల్టాదే. ఈ నేపథ్యంలో పలు దేశాలు ఇప్పటికే ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాలు ఆంక్షలను పొడిగించాయి. తాజాగా ఫిలిప్సీన్స్ కూడా భారత్ సహా 10 దేశాల ప్రయాణికులపై ఆంక్షలను పొడిగించింది. ఆగస్టు 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఇక ఏప్రిల్ 27న తొలిసారి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది ఫిలిప్పీన్స్. అప్పటి నుంచి పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. ఫిలిప్పీన్స్ ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, యూఏఈ, ఒమన్, థాయిలాండ్, మలేసియా, ఇండోనేషియా ఉన్నాయి. 


ప్రయాణ ఆంక్షల పొడిగింపు కోసం కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ చేసిన సిఫార్సును అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె ఆమోదించినట్టు అధ్యక్షభవనం అధికార ప్రతినిధి హ్యారీ రోక్ వెల్లడించారు. డెల్టా వేరియంట్ కారణంగా గురువారం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కేసులు పెరిగాయి. నాలుగు నెలల తర్వాత నిన్న ఒకేరోజు 12వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరోసారి 10 దేశాల ప్రయాణికులపై ఆంక్షలను పొడిగించినట్లు హ్యారీ రోక్ పేర్కొన్నారు. ఇక గడిచిన కొన్ని రోజులుగా ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దాంతో కొన్ని ప్రాంతాల్లోని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. కాగా, ఫిలిప్పీన్స్‌లో ఇప్పటివరకు కేవలం 11 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. మరోవైపు మహమ్మారి ఇప్పటికే దేశవ్యాప్తంగా 29,500 మందిని పొట్టనబెట్టుకుంది.          

Updated Date - 2021-08-13T17:28:04+05:30 IST