గుంటూరులో ఎంపీ, ఎమ్మెల్యే ఘర్షణ.. బలైన డీఎస్పీ, సీఐ

ABN , First Publish Date - 2020-10-17T17:59:26+05:30 IST

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్ హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ ఎంపీ- ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ఓ డీఎస్పీ, ఓ సీఐ బలి అయ్యారు. వారు ఎంపీ

గుంటూరులో ఎంపీ, ఎమ్మెల్యే ఘర్షణ.. బలైన డీఎస్పీ, సీఐ

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్ హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ ఎంపీ- ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ఓ డీఎస్పీ, ఓ సీఐ బలి అయ్యారు. వారు ఎంపీ మాటలు విని అదే ప్రాంత ఎమ్మెల్యేపై నిఘా పెట్టడం తీవ్ర దుమారం రేపింది. చివరకు విషయం ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లింది. సదరు పోలీసు అధికారులపై ఆకస్మిక వేటు పడటంతో బయటపడిన ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్‌ చర్చనీయాంశంగా మారింది.


ఎంపీని అడుగు పెట్టనివ్వొద్దని...

గుంటూరు జిల్లా పల్నాడు అధికార వైసీపీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరుకి వేదికగా మారింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, చిలకలూరి ఎమ్మెల్యే విడదల రజనీ మధ్య కొంతకాలంగా తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తాయి. తన నియోజకవర్గంలోకి అదే ప్రాంతం నుంచి ఎంపీగా కొనసాగుతున్న లావు శ్రీకృష్ణదేవరాయులును అడుగు పెట్టనివ్వకుండా చేయాలని ఎమ్మెల్యే రజనీ రెండుమూడు సార్లు ప్రయత్నించారని సమాచారం. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారివద్దకు ఎంపీ వెళుతున్నారనీ, వారితో సఖ్యతగా మెలగుతున్నారనీ ఎమ్మెల్యే ఆగ్రహించారట. తన అనుయాయులతో ఎంపీ కారును అడ్డుకునేలా ఎమ్మెల్యే చేయడంతో వివాదం తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది.


ఎమ్మెల్యేపై ఎంపీ ఫిర్యాదు...

ఎమ్మెల్యే విడదల రజనీ అనుయాయులు భూసేకరణ సమయంలో రైతుల వద్ద లక్షల్లో కమీషన్లు దండుకుంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని ఎమ్మెల్యే రజనీ పార్టీ అధిష్టానానికి వాదన వినిపించారు. ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలో జరిగిన అక్రమ తవ్వకాలపై కూడా ఎంపీ విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారట. అంతేకాకుండా ఆ అక్రమ తవ్వకాలు ఎమ్మెల్యే రజనీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని కూడా ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 


ఎంపీ నిఘా... ఎమ్మెల్యే సీరియస్..

ఇదిలావుంటే, కొద్దిరోజులుగా తనతోపాటు తన పీఏ, మరో ముఖ్య అనుచరుడి ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టినట్లు ఎమ్మెల్యే విడదల రజిని గుర్తించారట. తాము ఎవరెవరితో మాట్లాడుతున్నామనే కాల్‌ డేటాను గురజాల డీఎస్పీ, సీఐలు సేకరించారని ఆమెకు తెలిసింది. ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. తనపై ఎంపీ పెట్టిన నిఘాను సీరియస్‌గా తీసుకున్నారట. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత దృష్టికి ఆమె తీసుకెళ్లారట. పోలీసుశాఖలో ఆ ముఖ్యనేత మాటకు తిరుగులేకపోవడంతో.. సదరు ఇద్దరు అధికారులపై రాత్రికిరాత్రే వేటు పడింది. కాల్‌డేటా సేకరించిన పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ డీఎస్పీ, సీఐలను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమకు ఆ నంబర్లు ఎవరివో తెలియవనీ, ఎంపీ సూచన మేరకే అలా చేశామనీ ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నతాధికారులతో చెప్పినట్లు తెలిసింది.


ప్రభుత్వం పరువు పోతుందని...

మరోవైపు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారని తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌లపై నిఘా పెట్టిన విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం పరువు పోతుందని గ్రహించిన పార్టీ పెద్దలు.. అసలు విషయం బయటకు రాకుండా ఉండేందుకు విఫలయత్నం చేశారు. కేవలం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించినందుకే ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం. మొత్తంమీద పల్నాడులోని అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరడంతో.. రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మరి అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం ఇంతటితో ముగుస్తుందో... లేక ఇంకా పంతాలకు పోతారో చూడాలి.

Updated Date - 2020-10-17T17:59:26+05:30 IST