మనిషికి పంది కిడ్నీ! ప్రయోగం విజయవంతం

ABN , First Publish Date - 2021-10-21T07:59:58+05:30 IST

వైద్యరంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న అవయవాల కొరతను అధిగమించే దిశగా కీలక ముందడుగు పడింది....

మనిషికి పంది కిడ్నీ! ప్రయోగం విజయవంతం

వైద్యరంగంలో అమెరికా శాస్త్రవేత్తల సంచలనం



వాషింగ్టన్‌, అక్టోబరు 20: వైద్యరంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న అవయవాల కొరతను అధిగమించే దిశగా కీలక ముందడుగు పడింది. శాస్త్రవేత్తల దశాబ్దాల పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. పంది కిడ్నీని విజయవంతంగా మనిషికి అమర్చిన అమెరికా శాస్త్రవేత్తలు.. వైద్యరంగంలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అవయవ మార్పిడి సర్వసాధారణంగా మారిన ఈ రోజుల్లో.. అవయవాల కొరత వైద్యరంగాన్ని వేధిస్తోంది. దీన్ని అధిగమించే దిశగా.. పందుల అవయవాలను మనుషులకు అమర్చే అవకాశాలపై ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి.


కానీ, అలా అమర్చిన ప్రతిసారీ.. మానవ శరీరంలోని రోగనిరోధక శక్తి.. ఆ కిడ్నీపై దాడి చేసేది. అయినా అవయవ కొరతను అధిగమించేందుకు ఎప్పటికైనా పంది శరీర భాగాలే సరైనవని నమ్మిన శాస్త్రవేత్తలు.. ఈ దిశగా ప్రయోగాలు కొనసాగించారు. పంది రక్తకణాల్లో చక్కెర శాతం అధికంగా ఉండడం వల్లే వీటి కిడ్నీలు మానవ శరీరంలో ఇమడలేకపోతున్నాయని తాజాగా గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు జన్యు సవరణ చేసిన ఓ పందిపై ప్రయోగం చేశారు. దాని రక్తకణాల్లోని చక్కెరను తొలగించారు. ఆ తర్వాత దాని కిడ్నీని ఓ బ్రెయిన్‌డెడ్‌ మనిషి దేహానికి అమర్చారు.


శరీరం వెలుపలే ఈ కిడ్నీని అమర్చడం ద్వారా దాని పని తీరును పరిశీలించారు. రెండు రోజుల పాటు సాగిన ఈ పరిశీలనలో.. ఓ సాధారణ కిడ్నీ చేసే పనులన్నింటినీ ఇది సక్రమంగా నిర్వర్తించడాన్ని గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థ కూడా ఈ కిడ్నీని ఆమోదించిందని, దీంతో.. దశాబ్దాల పరిశోధనల్లో ఓ కీలక ముందడుగు పడినట్లయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.


నిజానికి ఈ తరహా ప్రయోగాలు 17 శతాబ్దం నుంచే జరుగుతున్నాయి. 20వ శతాబ్దంలో.. మరణం ఖాయమైన ఓ పసికందుకు కొండముచ్చు గుండెను అమర్చి 21 రోజుల పాటు బతికించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. దీంతో.. నాటి నుంచి ఊపందుకున్న ఈ ప్రయోగం.. తాజా విజయంతో మరో స్థాయికి చేరినట్లయింది. 


Updated Date - 2021-10-21T07:59:58+05:30 IST