రైల్వేల ప్రైవేటీకరణపై స్పష్టత ఇచ్చిన పీయూష్ గోయల్
ABN , First Publish Date - 2021-03-31T02:03:42+05:30 IST
భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించాలనే ఆలోచన లేదని
న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించాలనే ఆలోచన లేదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారతీయ రైల్వేలు ప్రభుత్వ ఆస్తి అని, అలాగే కొనసాగుతాయని చెప్పారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. పశ్చిమ బెంగాల్లో ఓ బహిరంగ సభలో మంగళవారం ఆయన మాట్లాడారు.
‘‘భారతీయ రైల్వేలు జాతి సంపద, ప్రజల సంపద. వీటిని ఎవరూ తాకలేరు. రైల్వేల ప్రైవేటీకరణ ఎన్నటికీ జరగదు. ప్రతిపక్షాల ప్రచార వలలో చిక్కుకోవద్దు. ఇది మీ ఆస్తి. అలాగే కొనసాగుతుంది’’ అని పీయూష్ గోయల్ ఖరగ్పూర్ బహిరంగ సభలో చెప్పారు. దేశవ్యాప్తంగా రైల్వే సేవలను మెరుగుపరిచేందుకు ప్రైవేటు పెట్టుబడులను స్వాగతించాలని చెప్పారు.
ఊహాగానాలకు బలం
ఇదిలావుండగా, గత ఏడాది ఇండియన్ రైల్వేస్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో కొన్ని స్టేషన్ల నిర్వహణకు అనుమతించారు. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దశాబ్దాలనాటి పద్ధతుల్లో మార్పులు తేవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయ రైల్వేలను ప్రభుత్వం ప్రైవేటీకరించబోతోందనే ఆరోపణలు వచ్చాయి. 150 రైళ్ళు, 50 రైల్వే స్టేషన్ల కార్యకలాపాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడానికి బ్లూప్రింట్ను తయారు చేయడం కోసం ఓ కమిటీని నియమించాలని గత ఏడాది అక్టోబరులో ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైల్వేలను ప్రైవేటీకరించబోతున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది.