పింఛన కావాలంటే జగనన్నకు మొక్కు..!

ABN , First Publish Date - 2021-12-03T06:22:13+05:30 IST

తన పింఛనను తొలగించడంతో పునరుద్ధరించాలని అధికారుల వద్దకెళ్లిన దివ్యాంగురాలికి వింత సమాధానం ఎ దురైంది

పింఛన కావాలంటే జగనన్నకు మొక్కు..!
తన పింఛన పుస్తకాన్ని చూపుతున్న పుల్లమ్మ

ఓ దివ్యాంగురాలికి అధికారి వింత సమాధానం

యాడికి, డిసెంబరు 2: తన పింఛనను తొలగించడంతో పునరుద్ధరించాలని అధికారుల వద్దకెళ్లిన దివ్యాంగురాలికి వింత సమాధానం ఎ దురైంది. పింఛన కావాలంటే (ముఖ్యమంత్రి) జగనన్నకు మొక్కు అంటూ అధికారి చెప్పినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. యాడికి మండలంలోని కత్తిమానుపల్లికి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు) పుల్లమ్మ ఏళ్లుగా పింఛన తీసుకుంటుండేది. గతేడాది డిసెంబరు నుంచి భూమి ఉందన్న సాకుతో పుల్లమ్మ పింఛన నిలిపేశారు. తన పేరుతో ఎకరా భూమి కూడా లేదని పుల్లమ్మ.. అధికారుల చుట్టూ తిరుగుతూ తన పింఛన పునరుద్ధరించాలని కోరుతోంది. పింఛన విషయమై అధికారి వద్దకెళితే జగనన్నకు మొక్కు పింఛన వస్తుందని పెద్ద మేడం చెబుతోందని పుల్లమ్మ చెబుతోంది. పెద్ద మేడం ఎవరు అంటే పేరు తెలియకపోవడంతో పెద్ద మేడమే అని చెబుతుండడం గమనార్హం. గురువారం పింఛన పునరుద్ధరణ కోసం వచ్చిన పుల్లమ్మ ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో అక్కడే నిరీక్షిస్తూ కనిపించింది. తనకు పొలమే లేదనీ, అయినా పింఛన ఎందుకు నిలిపేశారో అర్థం కావడం లేదని ఆవేదన చెందింది. ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పింఛన పునరుద్ధరించడం లేదని వాపోయింది. పింఛనే తనకు జీవనాధారమని చెప్పుకొచ్చింది. అధికారులు స్పందించి తన పింఛనను పునరుద్ధరించాలని వేడుకుంటోంది.


నా దృష్టికి రాలేదు

పుల్లమ్మ పింఛన విషయం నా దృష్టికి రాలేదు. ఆమె ఏ సచివాలయం పరిధిలోకి వస్తుందో విచారించి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమె అర్హురాలు అయితే పింఛన మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాం.

- పెద్దశ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి

Updated Date - 2021-12-03T06:22:13+05:30 IST