వరుస క్రమంలో మొక్కలు నాటాలి
ABN , First Publish Date - 2021-06-18T06:55:00+05:30 IST
జిల్లాలో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో మల్టీలేయర్ క్రమంలో మొక్కలు నాటాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు.
ఆదిలాబాద్టౌన్, జూన్ 17: జిల్లాలో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో మల్టీలేయర్ క్రమంలో మొక్కలు నాటాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. గురువారం ఎంపీడీవోలు, గ్రామీణాభివృద్ధి అధికారులు, ఇతర సీనియర్ అధికా రులతో తెలంగాణకు హరితహారం, గుంతలు తవ్వడం, శ్మశాన వాటికల నిర్మాణా లు, పల్లె ప్రకృతి వనాలు, మెగా పార్కుల ఏర్పాటుకు భూములను గుర్తించడం, నర్సరీల మెంటనెన్స్, ఇంటి మొక్కల పంపిణీ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వివిధ శాఖలకు సంబంధించిన రోడ్లకు ఇరువైపులా మల్టీలేయర్ క్రమంలో ఎవెన్యూ ప్లాంటేషన్కు గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలిపోయిన 80 శ్మశాన వాటికల నిర్మాణా లను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి రోజూ సంబంధిత అధికారులు ఆయా మండల అధికారులతో సమీక్షించాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమం కింద నాటే మొక్కలకు గుంతలను తవ్వి ఎస్టిమేట్ జనరేట్ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నర్సరీల మెంటనెన్స్ను క్రమపద్ధతిలో నిర్వహించాలని, నర్సరీబోర్డు, గేటు, ఎనిమల్ ట్రాప్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో భువనపల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు పది ఎకరాల భూములను గుర్తించాలన్నారు. జిల్లాలో నాలుగు మెగా పార్కుల్లో 10 లక్షల మొక్కలు నాటే విధంగా భూములను గుర్తించాలని సూచించారు. ఇంటింటికీ ఆరుమొక్కల చొప్పున పంపిణీ చేసే విదంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కొవిడ్ నేపథ్యంల మిషన్ మోడ్లో వ్యాక్సిన్ ప్రతీ శాఖలోని సిబ్బందికి ఇప్పించాలని సూచించారు. డీఆర్డీఏ పీడీ కిషన్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ పెద్ద మొత్తంలో క్రమపద్ధతిలో నాటే విధంగా పరిశీలించాలని కోరారు. జిల్లలో 80 శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని అదే విధంగా పెండింగ్లో ఉన్న 73 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు. డీపీవో శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో శానిటేషన్ కార్యక్రమాలను తప్పని సరిగా నిర్వహించాలని వర్షాకాలంలో నీటినిలువ ఉండకుండా చూడాలన్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు పర్యటించి ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.