పీఎమ్ కేర్స్ నిధి సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు: ప్రధాని కార్యాలయం

ABN , First Publish Date - 2020-05-31T19:24:25+05:30 IST

కరోనా కట్టడికి నిధుల సమీకరణ కోసం ఉద్దేశించిన పీఎమ్ కేర్స్ నిధిని సమాచారం హక్కు చట్టంలో పేర్కొన్న ప్రభుత్వ వ్యవస్థగా పరిగణించలేమని ప్రధాని కార్యాలయం తెలిపింది.

పీఎమ్ కేర్స్ నిధి సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు: ప్రధాని కార్యాలయం

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి నిధుల సమీకరణ కోసం ఉద్దేశించిన పీఎమ్ కేర్స్ నిధిని సమాచారం హక్కు చట్టంలో పేర్కొన్న ప్రభుత్వ వ్యవస్థగా పరిగణించలేమని ప్రధాని కార్యాలయం తెలిపింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఆర్‌టీఐ చట్టం కింద హర్ష అనే న్యాయవాది అడిగిన ప్రశ్నకు పీఎమ్ఓ ఈ విధంగా స్పందించింది. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో, లేదా ప్రభుత్వం నిధులతో ఏర్పాటైన వ్యవస్థలను పబ్లిక్ అథారిటీగా పరిగణిస్తారు. సూప్రీంకోర్టు గత తీర్పు ప్రకారం..ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష ఆర్థిక సహాయంతో నడుస్తున్న ఎన్‌జీవోలు కూడా ఆర్‌టీఐ పరిధిలోకి వస్తాయి. ఇక పీఎమ్ కేర్స్ ఫండ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రక్షణ, ఆర్థిక, హోం శాఖ మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. కాగా.. పీఎమ్ఓ జవాబుపై స్పందించిన హర్ష.. పీఎమ్ కేర్స్ ప్రభుత్వ ఆధీనంలో లేనప్పుడు దీనికి బాధ్యులు ఎవరన్న ప్రశ్న తలెత్తుతుందని వ్యాఖ్యానించారు. పీఎమ్ కేర్స్ కోసం ప్రభుత్వ చిహ్నాన్ని వాడటం, నిధి పేరు, ప్రభుత్వం అధికారుల చేతిలో దీని పగ్గాలు ఉండటం వంటి వన్నీ పీఎమ్ కేర్స్ పబ్లిక్ అథారిటీయే అని సూచిస్తున్నాయని తెలిపారు. దీనిపై పైకోర్టులో అప్పీలు చేస్తామన్నారు.   

Updated Date - 2020-05-31T19:24:25+05:30 IST