‘పీఎం కిసాన్’ రూ.10 వేలకు పెంపు!
ABN , First Publish Date - 2021-01-26T07:28:33+05:30 IST
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రూ.6 వేల ఆర్థికసాయాన్ని రూ.10 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే బడ్జెట్లో ప్రకటించనున్న కేంద్రం
ప్రజారోగ్యానికి బడ్జెట్లో కొత్త నిధి
జీడీపీలో 2.5% ఖర్చు చేయడం లక్ష్యం
కాలం చెల్లిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్
న్యూఢిల్లీ, జనవరి 25: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రూ.6 వేల ఆర్థికసాయాన్ని రూ.10 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2021 బడ్జెట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రూ.6 వేల సాయంతో పెద్దగా చేకూరుతున్న ప్రయోజనమేమీ లేదన్న అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎం-కిసాన్ సాయాన్ని రూ.10 వేలకు పెంచడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని కొంత చల్లార్చవచ్చనే అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కరోనా నేర్పిన పాఠంతో ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ దృక్పథంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. దేశంలో వైద్య సౌకర్యాలు, ఆరోగ్య సేవల కోసం ఇకపై అధిక నిధులు కేటాయించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ రంగానికి జీడీపీలో ఒక శాతానికి పైగా మాత్రమే ఖర్చు చేస్తుండగా.. 2025 నాటికి దీనిని 2.5 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకోనుంది. ఈ మేరకు రానున్న కేంద్ర బడ్జెట్లో సరికొత్త నిధిని ఏర్పాటు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిని సమకూర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం పౌరులు చెల్లించే వ్యక్తిగత ఆదాయపు పన్నుపై, కంపెనీలు చెల్లించే కార్పొరేట్ ట్యాక్స్పై నాలుగు శాతాన్ని హెల్త్, ఎడ్యుకేషన్ సెస్గా వసూలు చేయాలని యోచిస్తోంది. పర్యావరణాన్ని కాపాడేందుకుగాను కాలం చెల్లిన వాహనాలకు ఇకపై గ్రీన్ ట్యాక్స్ విధించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఎనిమిదేళ్లు దాటిన రవాణా వాహనాలు, 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ సందర్భంలో గ్రీన్ ట్యాక్స్ను విధించనున్నారు.