భారత దేశ ప్రతిష్ఠను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది : మోదీ

ABN , First Publish Date - 2022-01-20T19:23:01+05:30 IST

అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ

భారత దేశ ప్రతిష్ఠను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది : మోదీ

న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ‘స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 


మన దేశానికి అంతర్జాతీయంగాగల కీర్తి, ప్రతిష్ఠలను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇవి కేవలం రాజకీయాలు మాత్రమేనని చెప్పుకుంటూ పక్కన పడేయకూడదని మోదీ చెప్పారు. ఇది మన దేశ పరువు, ప్రతిష్ఠలకు సంబంధించిన అంశమని తెలిపారు. భారత దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బ్రహ్మ కుమారీస్, ఇతర అంతర్జాతీయ సంస్థలు పోషించదగిన పాత్రను వివరించారు. వివిధ దేశాల ప్రజలకు మన దేశం గురించి సరైన సమాచారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భారత దేశానికి వ్యతిరేకంగా ప్రచారమవుతున్న వదంతులు, పుకార్లపై పోరాడవలసిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పారు. 


‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను మోదీ ప్రశంసించారు. 


Updated Date - 2022-01-20T19:23:01+05:30 IST