ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం : మోదీ

ABN , First Publish Date - 2022-01-21T18:45:03+05:30 IST

స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ పోషించిన

ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం : మోదీ

న్యూఢిల్లీ : స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ పోషించిన పాత్రను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకుంటున్న వేళ గ్రానైట్‌తో తయారు చేసిన ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అందరితో పంచుకుంటుండటం తనకు సంతోషంగా ఉందని ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇది రుణం తీర్చుకునే, కృతజ్ఞతాభావానికి ప్రతీక అని తెలిపారు. 


దివ్యమైన నేతాజీ విగ్రహం తయారీ పూర్తయ్యే వరకు ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తానని తెలిపారు. 


మొదటి ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ ఏర్పాటు చేశారు. 1943లో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసి, బ్రిటిష్ పాలకులపై సాయుధ తిరుగుబాటును ప్రారంభించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేవిధంగా వేలాది మంది భారతీయులను ప్రేరేపించారు. ‘‘నువ్వు నాకు రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’’, ‘‘జైహింద్’’, ‘‘ఢిల్లీ చలో’’ వంటి నినాదాలతో భారతీయులను ప్రేరేపించి, ఉత్తేజితులను చేశారు. 


Updated Date - 2022-01-21T18:45:03+05:30 IST