అతివాదం, తీవ్రవాదమే అసలు సమస్యలు
ABN , First Publish Date - 2021-09-17T21:42:02+05:30 IST
తీవ్రవాదం, అతివాదం వంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) ఒక టెంప్లేట్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం తక్షణం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
తీవ్రవాదం, అతివాదం వంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) ఒక టెంప్లేట్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం తక్షణం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
వార్షిక ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్న ఆయన, ఆసియాలో ఎదురవుతోన్న ప్రస్తుత సమస్యలకి మూల కారణం పెరిగిపోతోన్న రాడికలైజేషనేనన్నారు. ఆఫ్ఘానిస్థాన్లోని పరిణామాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు.
ఎస్సీఓ రాడికలైజేషన్, ఎక్స్ట్రీమిజమ్పై పోరాడటానికి ఒక టెంప్లేట్ను అభివృద్ధి చేయాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. ఇస్లాంలోని మితవాద, సహనశీల వ్యవస్థలు, సంప్రదాయాల మధ్య బలమైన అనుబంధం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాడికలైజేషన్పై పోరాటం కేవలం ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశం కాదన్న మోదీ, దాని వల్ల యువతకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని వివరించారు.
సెంట్రల్ ఏషియా రీజియన్తో కనెక్టివిటికి తాము కట్టుబడి ఉన్నామని సైతం నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. కానీ, అదే సమయంలో ఏకపక్ష విధానాల వల్ల పని జరగదని స్పష్టం చేశారు. పారదర్శకమైన చర్చలు, పరస్పర సహకారం వల్ల మాత్రమే కనెక్టివిటి సాధ్యమన్నారు.
ఎస్సీఓలో కొత్తగా భాగస్వామ్యం పొందిన ఇరాన్ను భారత ప్రధాని ప్రత్యేకంగా స్వాగతించారు.