బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన మోదీ

ABN , First Publish Date - 2021-12-14T17:33:40+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం..

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన మోదీ

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం బీఎల్‌డబ్ల్యూ గెస్ట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల పనితీరును ఈ సమావేశంలో ప్రధాని సమీక్షించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల పురోగతికి సంబంధించి సీఎంలు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


అసోం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు బీహార్, నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ముందు సోమవారంనాడు కాశీ విశ్వనాథ్ ఆలయం దర్శనం సమయంలోనూ బీజేపీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఆయనతో కలిసి పాల్గొన్నారు. కాగా, ప్రధాని తన రెండో రోజు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటలకు వారణాసిలోని స్వర్‌వేద్ మహామందిర్‌లో నిర్వహించే సద్గురు సదఫల్‌దేవ్ విహంగం యోగ్ సంస్థాన్ 98వ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు.



Updated Date - 2021-12-14T17:33:40+05:30 IST