కేశూభాయ్ పటేల్ కుటుంబ సభ్యులకు మోదీ పరామర్శ

ABN , First Publish Date - 2020-10-30T17:43:41+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్ మాజీ

కేశూభాయ్ పటేల్ కుటుంబ సభ్యులకు మోదీ పరామర్శ

అహ్మదాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పటేల్ గురువారం దివంగతులైన సంగతి తెలిసిందే. 


మోదీ గుజరాత్‌లో రెండు రోజులపాటు పర్యటించేందుకు శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా గాంధీ నగర్ వెళ్ళి, కేశూభాయ్ పటేల్ నివాసానికి వెళ్ళారు. పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన గుజరాత్ సినీ సూపర్ స్టార్ నరేష్ కనోడియా, ఆయన సోదరుడు, మ్యూజిక్ కంపోజర్ మహేశ్ కనోడియాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరిద్దరూ ఇటీవలే మరణించారు. వీరిద్దరూ బీజేపీ నేతలే. 


మోదీ తన మాతృమూర్తి హీరాబెన్ మోదీని కూడా కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆమె మోదీ సోదరుడు పంకజ్ మోదీ నివాసంలో ఉంటున్న సంగతి తెలిసిందే. గాంధీ నగర్ శివారులో వీరి నివాసం ఉంది. 


అంతకుముందు మోదీకి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపాని విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఆయన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంత్యుత్సవాల సందర్భంగా కేవడియాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కేవడియా-అహ్మదాబాద్ మధ్య సీప్లేన్ సర్వీస్‌ను ప్రారంభిస్తారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శిస్తారు. 


Updated Date - 2020-10-30T17:43:41+05:30 IST