అయోధ్యలో దీపావళి ఉత్సవాలు ప్రారంభించనున్న మోదీ
ABN , First Publish Date - 2021-09-08T22:24:22+05:30 IST
ఈ ఏడాది పది రోజుల దీపావళి ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని..
అయోధ్య: ఈ ఏడాది పది రోజుల దీపావళి ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రారంభింనున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని ఈ దీపోత్సవ్లో పాల్గోనుండటం ప్రాధాన్యం సంతరించుకోనుంది. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలంలో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో నిర్వహించే చివరి దీపావళి ఉత్సవాలు కూడా ఇవే కానుండటం విశేషం. నవంబర్ 3న ప్రధాని పాల్గొననున్న దీపోత్సవ్ మెగా ఈవెంట్ను కోసం అయోధ్య డవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 6.5 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా గిన్నెస్ రికార్డు సాధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
''ప్రధాని మోదీ మరోసారి అయోధ్యలో ఉండనుండటం మన అదృష్టం. దీపోత్సవ్ సెట్ను ప్రముఖ బాలీవుడ్ కళా దర్శకుడు నితిన్ చంద్రకాంత్ దేశర్ రూపొందించనున్నారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాం. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుంది'' అని అయోధ్య డవలప్మెంట్ అథారిటీ ఉపాధ్యక్షుడు విశాల్ సింగ్ తెలిపారు. అయితే ప్రధాని రాకను ఆయన నేరుగా తెలియజేయలేదు. భవ్య రామాలయ నిర్మాణం జరుగుతున్న అయోధ్యలో ఆగస్టు 29న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సైతం పర్యటించారు. రాముడు లేకుండా అయోధ్య లేదని, అయోధ్య ఎక్కుడుంటే రాముడు అక్కడే ఉంటాడని రామాయణ్ కాంక్లేవ్ ప్రారంభోత్సవం సందర్భంగా రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు.