దౌర్జన్యకర శక్తులపై కలిసికట్టుగా గెలిచాం : మోదీ
ABN , First Publish Date - 2021-12-16T17:36:38+05:30 IST
దౌర్జన్యకర శక్తులపై కలిసికట్టుగా పోరాడి, విజయం
న్యూఢిల్లీ : దౌర్జన్యకర శక్తులపై కలిసికట్టుగా పోరాడి, విజయం సాధించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 1971లో పాకిస్థాన్తో యుద్ధంలో విజయం సాధించడాన్ని, అదే సమయంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడాన్ని గుర్తు చేస్తూ ఆయన గురువారం ఓ ట్వీట్ చేశారు.
1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ పరాజయంపాలవడంతో బంగ్లాదేశ్ ఏర్పాటైంది. ఈ సందర్భంగా డిసెంబరు 16న విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్లో స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వతంత్ర బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటున్నారు.
మోదీ గురువారం ఇచ్చిన ట్వీట్లో, 50వ విజయోత్సవాలనాడు తాను భారత సాయుధ దళాలకు చెందిన విముక్తి యోధులు, వీరాంగనలు, ధైర్యవంతులు, పరాక్రమవంతుల ధైర్యసాహసాలు, త్యాగాలను గుర్తు చేసుకుంటున్నానని తెలిపారు. కలిసికట్టుగా మనం పోరాడామని, దౌర్జన్యకర శక్తులను ఓడించామని పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బంగ్లాదేశ్లోని ఢాకాలో స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొనడం ప్రతి భారతీయునికి ప్రత్యేక ప్రాధాన్యంగల అంశమని తెలిపారు.
బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి కోవింద్ ఆ దేశ స్వాతంత్ర్య దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.