మన్ కీ బాత్‌లో మోదీ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-11-28T19:22:06+05:30 IST

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు

మన్ కీ బాత్‌లో మోదీ హెచ్చరిక

న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. 83వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి ఇంకా అంతం కాలేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ వైరస్ రూపాంతరం ఒమిక్రాన్‌ను గుర్తించడంతో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి ఇంకా ఉందని మర్చిపోవద్దని హెచ్చరించారు. 


దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో ఒమిక్రాన్‌ను గుర్తించారు. ఇది వేగంగా వ్యాపించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చించారు. ఒమిక్రాన్ వ్యాపించే అవకాశాల గురించి కూడా సమీక్షించారు. 


మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం మోదీ మాట్లాడుతూ, పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత దేశం 1971 డిసెంబరు 16న విజయం సాధించిందన్నారు. ఈ విజయానికి సంబంధించిన 50వ వార్షికోత్సవాలు డిసెంబరు 16న జరుపుకుంటామన్నారు. డిసెంబరులో దేశం నావికాదళ దినోత్సవాలు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే జరుపుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా తాను మన దేశ సాయుధ దళాలను, సైనికులను స్మరించుకుంటున్నానని తెలిపారు. మరీ ముఖ్యంగా ఈ హీరోలకు జన్మనిచ్చిన ధైర్యవంతులైన తల్లులను గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపారు. 


ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, ఇద్దరు లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. వీరిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద లబ్ధి పొందారు. వీరు ప్రాణ రక్షక చికిత్సను పొందారు. 


డిసెంబరు 6న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు మోదీ నివాళులర్పించారు. బాబా సాహెబ్ తన యావత్తు జీవితాన్ని దేశం, సమాజం పట్ల తన కర్తవ్య నిర్వహణకు అంకితం చేశారన్నారు. మనమంతా మన కర్తవ్యాలను నిర్వహించాలని రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి చెప్తోందని తెలిపారు. 


ప్రకృతిని పరిరక్షించవలసిన అవసరం చాలా ఉందని మోదీ చెప్పారు. ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగించినపుడు, దాని స్వచ్ఛతను నాశనం చేసినపుడు మాత్రమే అది మనకు ముప్పు కలిగిస్తుందన్నారు. ప్రకృతి మనల్ని ఓ తల్లిలా అనుసరిస్తుందని, నూతన వర్ణాలతో ప్రపంచాన్ని నింపుతుందని చెప్పారు. 


స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ వంటి ప్రాంతాలకు గొప్ప ప్రాధాన్యం ఉందని తెలిపారు. రాణీ లక్ష్మీబాయి, ఝల్కరి బాయ్ వంటి యోధులు ఇక్కడ జన్మించారన్నారు. ఖేల్ రత్న మేజర్ ధ్యాన్ చంద్ కూడా ఈ గడ్డపైనే పుట్టినట్లు తెలిపారు. 


Updated Date - 2021-11-28T19:22:06+05:30 IST