కోవిడ్-19పై మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

ABN , First Publish Date - 2022-01-10T00:14:27+05:30 IST

దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని ప్రధాన మంత్రి

కోవిడ్-19పై మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ రూపాంతరాలు డెల్టా, ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, వియానయాన శాఖ కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, రైల్వే బోర్డు చైర్మన్ పాల్గొన్నారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో జరిగింది. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన సమాచారం ప్రకారం, గడచిన 24 గంటల్లో 1,59,632 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో అత్యధిక కేసులు నమోదవడం  224 రోజుల్లో ఇదే తొలిసారి. 2021 మే 29న ఒక రోజులో 1,65,553 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 5,90,611కు చేరింది. ఇది 197 రోజుల్లో అత్యధికం. 


ప్రధాని మోదీ డిసెంబరు 24న కోవిడ్-19పై సమీక్షించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాజస్థాన్, మధ్య ప్రదేశ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, డామన్ అండ్ డయ్యూ ఆరోగ్య శాఖ మంత్రులతో జనవరి 10న మధ్యాహ్నం 3.30 గంటలకు కోవిడ్ పరిస్థితిపై మాట్లాడతారు. 


గర్భిణులు, దివ్యాంగులు, అదే విధంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న కట్టడి ప్రాంతాల్లోని ప్రభుత్వోద్యోగులకు ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పుదుచ్చేరిలో జనవరి 10 నుంచి పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


Updated Date - 2022-01-10T00:14:27+05:30 IST