సంత్ రవిదాస్కు ప్రధాని మోదీ నివాళులు
ABN , First Publish Date - 2021-02-27T19:47:24+05:30 IST
భక్తి ఉద్యమ వ్యాప్తికి 15, 16 శతాబ్దాల్లో విశేషంగా కృషి చేసిన సంత్ రవిదాస్ 644వ..
న్యూఢిల్లీ: భక్తి ఉద్యమ వ్యాప్తికి 15, 16 శతాబ్దాల్లో విశేషంగా కృషి చేసిన సంత్ రవిదాస్ 644వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ఘనంగా నివాళులర్పించారు. సమానత్వం, సౌహార్ద్రం, దయ వంటి ఉత్తమ గుణాలను తమ సందేశాలుగా శతాబ్దాల క్రితమే చాటిచెప్పిన ఘనత సంత్ రవిదాస్కు దక్కుతుందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. శతాబ్దాలుగా దేశ ప్రజలకు ఆయన సందేశాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మోదీ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
భక్తి ఉద్యమానికి చెందిన సంత్ రవిదాస్ 15, 16 శతాబ్దాల్లో పాడిన పలు కీర్తనలు గురుగ్రంథ్ సాహిబ్లోనూ చోటుచేసుకున్నాయి. 21వ శతాబ్దపు రవిదాసియా మతానికి ఆయనను వ్యవస్థాపకుడిగా కూడా కొందరు భావిస్తారు. రవిదాస్ జయంతిని మాఘ పౌర్ణమి పర్వదినం నాడు జరుపుకొంటారు.