చేతనైతే మా గ్రామంలోకి రా! అంటూ వైసీపీ ఎమ్మెల్యేకు యువకుడి సవాల్

ABN , First Publish Date - 2021-04-08T06:31:51+05:30 IST

పలు అంశాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే..

చేతనైతే మా గ్రామంలోకి రా! అంటూ వైసీపీ ఎమ్మెల్యేకు యువకుడి సవాల్

శ్రీకాళహస్తి(చిత్తూరు): పలు అంశాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదనరెడ్డిని పలువురు నిలదీశారు. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేయకుండానే ఆయన వెనుదిరిగారు. వివరాలివీ.. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం శ్రీకాళహస్తి మండలంలో ఎమ్మెల్యే రోడ్‌షో నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం వాంపల్లెలో ప్రచారం నిర్వహించి పోలి గ్రామానికి వెళ్లేయత్నం చేశారు. ఈ సందర్భంగా ఓ వర్గానికి మాత్రమే మద్దతిస్తున్నారంటూ పోలి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సునీల్‌(23) ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగాడు. తమ గ్రామంలో ప్రచారం చేయరాదనీ, పోలికి ఎలా వస్తావో చూస్తాననీ హెచ్చరించాడు. పార్టీ నేతను గౌరవం లేకుండా మాట్లాడుతున్న నిన్ను బాగా గుర్తుంచుకుంటానని ఎమ్మెల్యే ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయితే వినకుండా పోలికి రాకూడదని సునీల్‌ పట్టుబట్టడంతో ఆయన మరో గ్రామానికి ప్రచారానికి బయలుదేరాల్సి వచ్చింది. అనంతరం మధుసూదనరెడ్డి సమాచారంతో శ్రీకాళహస్తి రూరల్‌ పోలీసులు అక్కడికి చేరుకుని సునీల్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌ తరలించారు. కాగా, బీవీపురం పంచాయతీ గొల్లపల్లెలో ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మధును స్థానికులు అడ్డుకున్నారు. పల్లంపేటలో జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి ఓ వర్గానికి మాత్రమే ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు. దీనిపై పలువురు వాగ్వాదానికి దిగడంతో ఇక్కడా ఆయన ప్రచారం చేయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. 

Updated Date - 2021-04-08T06:31:51+05:30 IST