మహిళలకు మరింత భరోసా..!

ABN , First Publish Date - 2021-01-21T06:57:21+05:30 IST

మియాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది.

మహిళలకు మరింత భరోసా..!

ఇమ్మిడియెట్‌ రెస్పాన్స్‌ బృందాలు

ఇప్పటికే మూడు టీంలు

మరో మూడు ఏర్పాటుకు కసరత్తు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మియాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇరుగుపొరుగు వారు డయల్‌-100కు ఫోన్‌ చేశారు. సమాచారం అందుకున్న డొమెస్టిక్‌ వయెలెన్స్‌ ఇమ్మిడియెట్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టారు. ఉరేసుకున్న బాధితురాలిని పైకిలేపి, ఉరి తాడు కట్‌చేసి, ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో బాధిత మహిళ ప్రాణాలతో బయటపడింది. బాధిత మహిళ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్న పోలీసులు ఆమెను వేధింపులకు గురిచేసిన భర్తపై మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ‘మీకు మేమున్నాం’ అంటూ భరోసా కల్పించారు. గృహ హింసకు గురైన బాధిత మహిళలకు ఇమ్మిడియెట్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ రక్షణగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని షీటీమ్స్‌ ఇన్‌చార్జి, విమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ విభాగం డీసీపీ అనసూయ తెలిపారు. 

ఆరు బృందాల ఏర్పాటుకు కసరత్తు..

రాజేంద్రనగర్‌, జగద్గిరిగుట్ట, మియాపూర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇప్పటికే మూడు డొమెస్టిక్‌ వయొలెన్స్‌ ఇమ్మిడియెట్‌ రెస్పాన్స్‌ ప్రత్యేక పెట్రోలింగ్‌ బృందాలు ఉన్నాయి. బాధిత మహిళల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతుండటం, మంచి ఫలితాలు రావడంతో అదనంగా మరో మూడు బృందాలను ఏర్పాటు చేయడానికి సీపీ సజ్జనార్‌ కసరత్తు చేస్తున్నారు. గృహ హింస, మహిళలపై వేధింపులు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించిన జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఈనెల 27న మూడు ఇమ్మిడియెట్‌ రెస్పాన్స్‌ ప్రత్యేక పెట్రోలింగ్‌ బృందాలను ప్రారంభించనున్నట్లు తెలిసింది. 

గత జూలై టు డిసెంబర్‌ 

వరకు అందుకున్న కాల్స్‌

బాధిత మహిళల నుంచి 

వచ్చిన డయల్‌-100 కాల్స్‌ 491

చర్యలు తీసుకున్న కాల్స్‌ 387 (మిగిలినవి 

సైబరాబాద్‌ 

పరిధిలోకి రానివి)

ఎఫ్‌ఐఆర్‌లు 07

కౌన్సెలింగ్‌తో పరిష్కరించినవి 105

వార్నింగ్‌, కౌన్సెలింగ్‌ 129

పోలీస్‌ స్టేషన్‌కు పంపినవి 111

రాజీ కుదిర్చినవి 31

భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్‌ 04

Updated Date - 2021-01-21T06:57:21+05:30 IST