పట్టాభి ఇంటి దగ్గరకు భారీగా చేరుకుంటున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-10-20T22:28:17+05:30 IST
టీడీపీ నేత పట్టాభి ఇంటి దగ్గరకు భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. కాసేపట్లో పట్టాభిని అరెస్ట్ చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
విజయవాడ: టీడీపీ నేత పట్టాభి ఇంటి దగ్గరకు భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. కాసేపట్లో పట్టాభిని అరెస్ట్ చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. సీఎం జగన్ను పట్టాభి దూషించారంటూ కేసులు నమోదు చేసి ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. పట్టాభిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఆ సమయంలో పట్టాభి, ఆయన భార్య చందన ఇంట్లో లేరు. ఇంట్లో పట్టాభి కుమార్తె అన్నపూర్ణ, పనిమనిషి గోవిందమ్మ ఉన్నారు. డ్రైవర్ శివారెడ్డి బయట కూర్చుని ఉన్నాడు. మొదట ముగ్గురు, నలుగురు యువకులు వెళ్లి పట్టాభి ఉన్నాడా అంటూ డ్రైవర్ను అడిగారు. లేరని చెప్పడంతో అంతా దాడికి పాల్పడ్డారు. వందమంది ఒక్కసారిగా లోపలకు రావడంతో పనిమనిషి గోవిందమ్మ భయంతో చిన్నారి అన్నపూర్ణను తీసుకుని బాత్రూంలోకి దాక్కుంది. దుండగులు ఇల్లు మొత్తాన్ని చెల్లాచెదురు చేశారు. మహిళలు తొడగొట్టుకుంటూ పట్టాభిపై బూతుపురాణం విప్పారు. 4.10- 4.15 గంటల మధ్య విధ్వంసం జరిగిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కొడవళ్లతో పట్టాభి పీక కోస్తామంటూ మహిళలు నినాదాలు చేశారు.