కండువా లేని టీఆర్ఎస్ నాయకులుగా పోలీసులు: వివేక్
ABN , First Publish Date - 2021-01-19T18:47:51+05:30 IST
జిల్లా పోలీసులపై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కండువా లేని టీఆర్ఎస్ నాయకులుగా పోలీసులు మారారని వివేక్ విమర్శించారు.
మంచిర్యాల జిల్లా: జిల్లా పోలీసులపై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కండువా లేని టీఆర్ఎస్ నాయకులుగా పోలీసులు మారారని వివేక్ విమర్శించారు. మంగళవారం ఆయన బెల్లంపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నాయకుల చేస్తున్న అక్రమాలకు, అన్యాయాలకు, అవినీతికి పోలీసులు వంతపాడుతున్నారన్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు జిల్లాలో చేస్తున్న భూకబ్జా, ఇసుక మాఫియాకు పోలీసులు సహకరిస్తూ అండగా ఉంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, విప్ అండతో నాయకులు జిల్లాలో భూకబ్జాలు చేస్తున్నారన్నారన్నారు.
టీఆర్ఎస్ నాయకుల అండతోనే గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందన్నారు. దీంతో వారి అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయన్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతోనే బీజేపీ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెడితే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని వారికి ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై పోరాడే కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.