ఓ చిన్న గొడవను ఆపేందుకు వెళ్లి.. మహిళలని చూడకుండా..

ABN , First Publish Date - 2020-06-07T06:39:17+05:30 IST

ఓ చిన్న గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు..

ఓ చిన్న గొడవను ఆపేందుకు వెళ్లి.. మహిళలని చూడకుండా..

కొత్తముక్కాంలో ఉద్రిక్తత

మహిళలపై పోలీసుల దాడి

సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలు, మరో మహిళ 

ఖాకీలపై యువకుల తిరుగుబాటు

సీసీ రోడ్డు నిర్మాణమే వివాదానికి కారణం

విచారించిన డీఎస్పీ


రణస్థలం(శ్రీకాకుళం): ఓ చిన్న గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా వారిపె విచక్షణారహితంగా దాడి చేశారు. వారి దెబ్బలకు తాళలేక ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఖాకీలపై స్థానిక యువకులు తిరగబడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల పంచాయతీ కొత్తముక్కాం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు...


గ్రామంలో ముందుగా కాలువలు నిర్మించి ఆ తరువాత సీసీ రోడ్లు వేస్తామని అధికారులు, నాయకులు చెప్పారు. అయితే, ఓ వీధిలో కాలువ నిర్మించకుండా పాత రోడ్డుపైనే కొత్తగా సీసీ రోడ్డు వేసేందుకు శనివారం పనులు ప్రారంభించారు. ఈ పనులను వైసీపీకి చెందిన ఓ వర్గం అడ్డుకుంది. కాలువలు కట్టకుండా రోడ్డును ఎత్తు చేస్తే వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చేస్తుందని... ముందు కాలువలు నిర్మించాలంటూ మాజీ సర్పంచ్‌ వర్గీయులను వారు నిలదీశారు. దీంతో వివాదం రాజుకుంది. ఇరువర్గాలు కొట్లాటకు దిగాయి.


సమాచారం అందుకున్న జేఆర్‌పురం పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్‌ఐ ఇ.శ్రీనివాసరావుతో సహా పోలీసు సిబ్బంది మహిళలను లాఠీలు, చేతులతో విచక్షణారహితంగా కొట్టారు. వెంటాడి వెంటాడి కొట్టడంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో ఓ వర్గానికి చెందినవారు పారిపోయి దాక్కోవలసిన పరిస్థితి నెలకొంది. మహిళలపై పోలీసులు దాడికి దిగడంతో స్థానిక యువకులు వారిపై తిరగబడ్డారు. అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లావేరు పోలీసులను కొత్తముక్కాం గ్రామానికి రప్పించడం గమనార్హం.


పోలీసుల దెబ్బలకు 60 ఏళ్ల వృద్ధురాలు పోలీసమ్మ, ఆమె బంధువైన మరో మహిళ సొమ్మసిల్లి పడిపోయారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే తమపై దారుణంగా దాడులు చేయడం బాధాకరమని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఒకవర్గానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకొని దాడికి దిగడం విమర్శలకు తావిస్తోంది. ఘటనా స్థలానికి డీఎస్పీ మూర్తి చేరుకున్నారు. ఇరువర్గాలను పిలిచి విచారించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు. అనంతరం గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-06-07T06:39:17+05:30 IST