బీజేపీ నాయకుల దీక్షను అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-04-19T06:04:36+05:30 IST
ప్రభుత్వాస్పత్రి స్థాయి పెంచాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆమరణ నిరాహారదీక్షకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
- నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట
- ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఇల్లంతకుంట, ఏప్రిల్ 18: ప్రభుత్వాస్పత్రి స్థాయి పెంచాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆమరణ నిరాహారదీక్షకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మండలకేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం బీజేపీ నాయకులు నిరాహారదీక్ష చేస్తున్నారనే సమాచారంతో ఉదయమే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు బస్టాండ్ ప్రాంతానికి చేరుకొని తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. పోలీస్స్టేషన్కు తరలించడానికి సిద్ధమవ్వగా తోపులాట జరిగింది. చివరకు పోలీసులు నాయకులను అరెస్టు చేయగా పోలీస్స్టేషన్లో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు అరెస్టును నిరసిస్తూ మరికొంత మంది పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల కేంద్రంలో ఎస్సైలు మల్లేశంగౌడ్, లక్ష్మారెడ్డి, రవి ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. అంతకుముందు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆస్పత్రి స్థాయి పెంచాలని కోరుతుంటే ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందన్నారు. అరెస్టుల ద్వారా ఉద్యమాలను అణచివేయలేరన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి నాగసముద్రాల సంతోష్, బండారి రాజు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకులపై పోలీసుల కక్షసాధింపు చర్యలు
సిరిసిల్ల రూరల్: బీజేపీ నాయకులపై పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీజేపీ నాయకుల దీక్షను అడ్డుకొని అరెస్టు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండతోనే పోలీసులు బీజేపీ నాయకులపై అమాను షంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణువర్ధన్, పట్టణ అధ్యక్షుడు మల్లఢపేట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.