బీజేపీ నేతలకు పోలీసుల బ్రేకులు

ABN , First Publish Date - 2022-01-26T09:01:31+05:30 IST

బీజేపీ ఆధ్వర్యంలో గుడివాడలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకులెవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

బీజేపీ నేతలకు పోలీసుల బ్రేకులు

గుడివాడ వెళ్లకుండా అడ్డంకులు

సోము వీర్రాజు తదితరుల అరెస్టు


విజయవాడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఆధ్వర్యంలో గుడివాడలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకులెవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేశ్‌ తదితరులపై జులుం ప్రదర్శించి మార్గమధ్యంలోనే అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం విజయవాడలో ఉద్యోగులకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొన్న బీజేపీ నాయకులు ఆ తర్వాత గుడివాడ బయల్దేరారు. అప్పటికే మంత్రి కొడాలి నాని అనుచరులు గుడివాడ వీకేఆర్‌ కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి సంబరాల కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారు. దీంతో స్థానిక బీజేపీ నాయకుడి అపార్ట్‌మెంటులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంకోవైపు.. బీజేపీ నాయకుల గుడివాడ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను మోహరించారు. విజయవాడ నుంచి గుడివాడకు వెళ్లే మార్గాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. వీర్రాజు, ఆదినారాయణ రెడ్డి, బాజీ తదితరులను ఉంగుటూరు మండలం నందమూరు అడ్డరోడ్డు వద్ద అడ్డుకున్నారు. గుడివాడ వెళ్లేందుకు అనుమతి లేదని వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని కోరారు. 


బీజేపీ నాయకులు ససేమిరా అనడంతో తోపులాట జరిగింది. వీర్రాజు సహా నాయకులందరినీ బలవంతంగా లాక్కొని వెళ్లి ట్రాలీ ఆటో ఎక్కించి ఉంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. పామర్రు మీదుగా గుడివాడ వెళ్లేందుకు సిద్ధమైన ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పాతూరి నాగభూషణం తదితరులను పెదపారుపూడి వద్ద అడ్డుకుని తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై సీఎం రమేశ్‌ మండిపడ్డారు. వారిపై పార్లమెంటులో ప్రివిలేజ్‌ మోషన్‌ పెడతానని హెచ్చరించారు. 

Updated Date - 2022-01-26T09:01:31+05:30 IST