రంజాన్ రోజు సెలవైనా.. సంగం డెయిరీలో సోదాలు
ABN , First Publish Date - 2021-05-15T09:46:43+05:30 IST
సంగం డెయిరీలో రంజాన్ పండుగ సెలవు అయినప్పటికీ శుక్రవారం కూడా ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఉదయం డెయిరీ పరిపాలనా కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు..
కార్యదర్శి, చైర్మన్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
చేబ్రోలు, మే 14: సంగం డెయిరీలో రంజాన్ పండుగ సెలవు అయినప్పటికీ శుక్రవారం కూడా ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఉదయం డెయిరీ పరిపాలనా కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు నేరుగా కంపెనీ కార్యదర్శి సందీప్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన్ను గురువారం అదుపులోకి తీసుకుని గుంటూరు ఏసీబీ కార్యాలయంలో సుమారు 5 గంటల పాటు విచారించారు. అనంతరం అందుబాటులో ఉండాలంటూ వదిలివేసినట్లు సమాచారం. శుక్రవారం సోదాలు ఆయనే లక్ష్యంగా జరిగాయి. అయితే కొన్ని గంటల పాటు తనిఖీలు జరిపినా. అనుమానాస్పద లావాదేవీల ఆరోపణలకు సంబందించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని సమాచారం. కంపెనీ మినిట్స్ బుక్ సీజ్ చేస్తామని ఏసీబీ అధికారులు కార్యదర్శికి చెప్పగా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మినిట్స్ బుక్లో కంపెనీ వ్యాపార సంబంధ విషయాలే తప్ప మరో అంశాలు ఏమీ ఉండవని అభ్యంతరం చెప్పారు. కొన్ని గంటల పాటు సమాలోచనల అనంతరం.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మినిట్స్ తాలూకు పేపర్లను జిరాక్స్ తీసుకుని అధికారులు వెళ్లినట్లు తెలిసింది. అలాగే చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర చాంబర్లోనూ సోదాలు నిర్వహించారు. అక్కడ ఎటువంటి వివరాలు లభించకపోవడంతో పంచనామా నిర్వహించి వెళ్లిపోయారు. విజయవాడ ఏసీబీ కోర్డు ఆదేశాల ప్రకారం ఏసీబీ తనిఖీలకు శనివారమే ఆఖరిరోజు. ఈ నెల 17వ తేదీన సోదాల నివేదికను కోర్టుకు అందజేయాల్సి. ఉంది. కాగా సెలవు రోజు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇంకోవైపు ఏసీబీ బృందంలోని ఉన్నతాధికారులు కొందరు శుక్రవారం కూడా ఎటువంటి రక్షణ చర్యలు పాటించకుండా డెయిరీ ప్రాసెసింగ్ ప్లాంట్లోకి వెళ్లడంతో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.