కొయ్యూరు అడవుల్లో గాలింపు
ABN , First Publish Date - 2020-12-04T06:12:41+05:30 IST
విశాఖ జిల్లా కొయ్యూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతానికి ముగ్గురు మావోయిస్టు నేతలు వచ్చినట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు.
మావోయిస్టు నేతలు వచ్చినట్టు పోలీసులకు సమాచారం?
విశాఖపట్నం, డిసెంబరు 3: విశాఖ జిల్లా కొయ్యూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతానికి ముగ్గురు మావోయిస్టు నేతలు వచ్చినట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, మావోయిస్టు అగ్రనేత ఆర్కే రక్షణ దళ సభ్యురాలు రామె మడ్కామి బుధవారం కొరాపుట్లో లొంగిపోయింది. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే పోలీసులు గాలింపు చేపట్టినట్టు చెబుతున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ముద్రపడిన బూదరాళ్లు, ఎం.భీమవరం, యు.చీడిపాలెం పంచాయతీల సరిహద్దు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి గాలిస్తున్నారు. అలాగే ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.