మొబైల్ షాప్ యజమానిని చితకబాదిన పోలీసులు.. కోర్టు ఆదేశాలతో ఏడుగురిపై కేసు
ABN , First Publish Date - 2021-09-16T22:54:20+05:30 IST
మొబైల్ షాప్ యజమాని, అతడి సిబ్బందిపై దాడిచేసి రూ. 80 వేల నష్టానికి కారణమైన ఏడుగురు
కసరగాఢ్: మొబైల్ షాప్ యజమాని, అతడి సిబ్బందిపై దాడిచేసి రూ. 80 వేల నష్టానికి కారణమైన ఏడుగురు పోలీసు అధికారులపై కేసు నమోదు చేయాలని కేరళలోని కసర్గాడ్ కోర్టు మంజేశ్వర్ పోలీసులను ఆదేశించింది. ఏప్రిల్లో పైవలికేలోని జావేద్ అసిఫ్ మొబైల్ సేల్స్ అండ్ రిపైర్ షాపుపై దాడి చేసిన పోలీసులు యజమాని, సిబ్బందిని దారుణంగా చితకబాదారు. పోలీసులు తన దుకాణంపై దాడిచేసి తమను చితకబాదిన వీడియోను అందించినప్పటికీ కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో జావేద్ కసర్గాడ్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.
ఏప్రిల్లో ఒక రోజు సాయంత్రం ఏడుగురు పోలీసులు అసిఫ్ దుకాణానికి వచ్చి మూసివేయాలని ఆదేశించారు. షాపును 8 గంటల వరకు తెరిచి పెట్టుకునేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయని ఆయన బదులిచ్చారు. అది విన్న పోలీసులు ఆగ్రహంతో ఊగిపోతూ అసిఫ్, అతడి సిబ్బందిపై దాడిచేసి దారుణంగా చితకబాదారు. ఈ క్రమంలో అసిఫ్ యాపిల్ వాచ్ కనిపించకుండా పోయింది. రెండు ఫోన్ల డిస్ప్లే పాడైంది.
గాయాలపాలైన అసిఫ్ మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మెడికల్ లీగల్ ఇన్ఫర్మేషన్ను మంజేశ్వర్ పోలీస్ స్టేషన్కు ఆసుపత్రి పంపింది. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితుడి తరపు న్యాయవాది షఫీ కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత దానిని జిల్లా పోలీస్ చీఫ్కు ఈ-మెయిల్ చేసినప్పటికీ ఆయన కూడా స్పందించలేదని పేర్కొన్నారు.
దీంతో అసిఫ్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీస్ చీఫ్ను నేరుగా వెళ్లి కలిశారు. అయినప్పటికీ కేసు నమోదు చేయకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఏడుగురు గుర్తు తెలియని పోలీసులపై మంజేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై అతిక్రమణ నేరం, దాడి, ఆస్తి ధ్వంసం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి కేసులు నమోదయ్యాయి.