పొలిటికల్‌ ఫోకస్‌

ABN , First Publish Date - 2022-06-11T07:54:40+05:30 IST

జిల్లా రాజకీయాలపై ప్రధానపక్షాలు దృష్టిపెట్టాయి. కొన్ని రోజులుగా అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో స్పీకర్‌, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. ప్రభుత్వ పథకాలను అమలయ్యేవిధంగా చూడడంతో పాటు ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.

పొలిటికల్‌ ఫోకస్‌

జిల్లా కార్యక్రమాల్లో పాల్గొంటున్న స్పీకర్‌, మంత్రి, ఎమ్మెల్యేలు

రచ్చబండ కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలు

పట్టుకోసం బీజేపీ నేతల యత్నాలు

రేపటి నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

నిజామాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా రాజకీయాలపై ప్రధానపక్షాలు దృష్టిపెట్టాయి. కొన్ని రోజులుగా అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో స్పీకర్‌, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. ప్రభుత్వ పథకాలను అమలయ్యేవిధంగా చూడడంతో పాటు ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. జిల్లాల్లో ఉంటూ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ పేరుమీద కాంగ్రెస్‌ 20 రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పాటు సీనియర్‌ నేతలంతా పాల్గొంటున్నారు. రైతులకు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో వివరిస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు పదాదికారుల సమావేశాలతో పాటు ప్రజలను కలుస్తూ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రమంత్రి మహేంద్రనాథ్‌ రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి కేంద్ర పథకాల లబ్ధిదారుతో పాటు ప్రముఖులతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. 

 ఫ నియోజకవర్గాల్లో అధికార పార్టీ పర్యటనలు..

జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై అధికార పార్టీ నేతలు మరింత దృష్టిపెట్టారు. కొన్ని నెలలుగా గ్రామాలను పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. కొత్త పథకాలను మంజూరు చేయించుకుంటూ ముందుకుపోతున్నారు. నియోజకవర్గాల్లో కలియతిరుగుతున్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేష్‌గుప్త, షకీల్‌ అమీర్‌లు జిల్లాల్లో ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఎలాంటి పథకాలను అమలు చేసిందో వివరిస్తున్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్‌, రైతుబంధు, దళితబంధుతో పాటు ఇతర పథకాలను వివరిస్తున్నారు. మరింత తమకు ఎదురులేకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పీకే నివేదిక బట్టి టికెట్లను కేటాయించే అవకాశం ఉండడంతో ప్రజల్లోనే ఉండి వారి అవకాశాలను మరింత మెరుగుపరుచుకునేవిధంగా ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు పాల్గొంటున్నారు. గ్రామ, మండలస్థాయిలోని ప్రజాప్రతినిధులు, నేతలను కలుపుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఎక్కువ సమయం అందుబాటులో ఉండేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు కూడా జిల్లాలో పర్యటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించనున్నారు. పల్లెప్రగతిని సమీక్షించడంతో పాటు ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షించే ఏర్పాట్లను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరింత బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాపై ప్రత్యేక నజర్‌పెట్టి కార్యక్రమాలు అమలయ్యేవిధంగా చూస్తున్నారు.

 ఫ  రచ్చబండ కార్యక్రమాలతో కాంగ్రెస్‌..

జిల్లాలో వరంగల్‌ డిక్లరేషన్‌ పేరుమీద కాంగ్రెస్‌ పార్టీ గత 20 రోజులుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇన్‌చార్జీల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో రచ్చబండ నిర్వహిస్తూ వరంగల్‌ డిక్లరేషన్‌లో రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాది కూలీలతో పాటు వ్యవసాయ కూలీలతో మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కడితే వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకారం అన్ని పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తామని వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాల్లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సలహాలు ఇస్తూ సజావుగా జరిగేవిధంగా చూస్తున్నారు. పలు నియోజకవర్గాల పరిధిలో ఆయన పాల్గొంటున్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ ఆర్మూర్‌పై నజర్‌పెట్టి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలోని ఆర్మూర్‌, నందిపేట, మాక్లూర్‌ మండలాల పరిధిలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సంధాన కర్తగా వ్యవహరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గా ఇన్‌చార్జీలు డాక్టర్‌ భూపతిరెడ్డి, తాహెర్‌బిన్‌ హుందాన్‌, మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌, కాసుల బాల్‌రాజ్‌తో పాటు ఇతర నేతలు పాల్గొంటున్నారు. సీనియర్‌ నేతలు నగేష్‌రెడ్డి, గడుగు గంగాధర్‌  రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు నేతలకు అందుబాటులో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. రచ్చబండ ద్వారా కాంగ్రెస్‌ క్యాడర్‌కు ఊపిరిపోసే ప్రయత్నం చేయడంతో పాటు జిల్లాలో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేయడంతో పాటు వారి మద్దతు కూడగడుతున్నారు. 

 ఫ పట్టుకోసం బీజేపీ యత్నం..

జిల్లాలో బీజేపీ తన పట్టుకోసం ప్రయత్నం చేస్తోంది. పార్టీ నేతలు ఇతర పార్టీలకు పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింత ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్‌, జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జీలు మల్లికార్జున్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, మేడపాటి ప్రకాష్‌, దినేష్‌, ధన్‌పాల్‌ సూర్యనారాయణతో పాటు ఇతర నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీనియర్‌ నేతలు అల్జాపూర్‌ శ్రీనివాస్‌, భూపతిరెడ్డితో పాటు ఇతర నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర భారీపరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా ఆర్మూర్‌లో ఈ నెల 12న జరిగే కార్యక్రమంలో పార్టీ నేతలతో మాట్లాడారు. వారికి దిశా నిర్దేశం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులతో మాట్లాడడంతో పాటు ఎన్నివేల కోట్లను ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారో ఆయన వివరించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. భారీగా లబ్ధిదారులను ఆర్మూర్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 13న మంత్రి వేల్పూర్‌ మండలం కుకునూర్‌లో పర్యటించనున్నారు. ఆ గ్రామంలో ఎంపీ నిధులతో చేపట్టిన కార్యక్రమాలను మంత్రి పరిశీలిస్తారు. అక్కడ నుంచి పార్టీ కార్యాలయంలో నేతలతో మాట్లాడే ఏర్పాట్లను చేస్తున్నారు. కేంద్రమంత్రి రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తుండడంతో పార్టీని మరింత బలోపేతం చేసేవిధంగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని సీనియర్‌ నేతలతో పాటు రాష్ట్ర పార్టీ సీనియర్‌ నేతలు కూడా ఈ కేంద్రమంత్రి కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

జిల్లాలో మూడు పార్టీల నేతలు తమ ప్రయత్నాల్లో ఉండగా బీఎస్పీ, ఆమ్‌ఆద్మీ పార్టీలతో పాటు వైఎస్‌ఆర్‌టీపీ నేతలు కూడా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలో పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ మూడు పార్టీల నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలు ఒకేసారి కార్యక్రమాలు చేపట్టడం వల్ల జిల్లాలో రాజకీయ సందడి కనిపిస్తోంది.

Updated Date - 2022-06-11T07:54:40+05:30 IST