పోలీసులే ఆపద్బాంధవులై..
ABN , First Publish Date - 2021-05-06T06:29:44+05:30 IST
ప్రజలకు చట్ట భద్రత కల్పించడమే కాదు... ప్రాణాపాయ స్థితిలో వారి ప్రాణాలను సాహసించి కాపాడటంలో ముందుంటామని రుజువు చేసి ఆపద్భాందవులుగా పెనమలూరు పోలీసులు.
ఆక్సిజన్ సిలిండర్లు తరలించి బాధితులను కాపాడిన వైనం
పెనమలూరు, మే 5: ప్రజలకు చట్ట భద్రత కల్పించడమే కాదు... ప్రాణాపాయ స్థితిలో వారి ప్రాణాలను సాహసించి కాపాడటంలో ముందుంటామని రుజువు చేసి ఆపద్భాందవులుగా పెనమలూరు పోలీసులు. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో కొద్ది రోజులుగా ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో అనేక మంది కరోనా బాధితులు మృత్యువాత పడుతున్నారు. కానూరు అశోక్నగర్లో బందరు రోడ్డులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో 40 మంది కరోనా బాధితులు ఆక్సిజన్ ద్వారా చికిత్స పొందుతున్నారు. బుధవారం మధ్యాహ్నం నాటికి ఆసుపత్రిలో పూర్తిగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆసుపత్రి సిబ్బంది సాయంత్రం వరకూ అనేక ప్రాంతాలలో గాలించినా ఆక్సిజన్ లభించలేదు. మరో అర్ధగంట ఆగితే బాధితులంతా మృత్యువాత పడే ప్రమాదమేర్పడింది. అప్పటికే బాధితుల బంధువుల ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చెందుతున్నారు. రెండు గంటలపాటు బందరు రోడ్డులో టెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పెనమలూరు సీఐ సత్యనారాయణ హుటాహుటిన సిబ్బందితో ఆసుపత్రికి చేరుకుని ఏసీపీ శ్రీనివాసరెడ్డికి సమాచారం అందించారు. సీపీ శ్రీనివాసులు సహాయంతో హుటాహుటిన పది సిలిండర్లను పోలీసుల వాహనాలలో ఆసుపత్రికి తరలించారు. అక్కడున్న పోలీసు సిబ్బంది సిలిండర్లను ఆసుపత్రిలోని బాధితుల వద్దకు చేర్చి వెంటనే వారికి ఆక్సిజన్ను అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలిగారు.