పోషకాహారంపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2021-09-17T05:21:40+05:30 IST
పోషకాహార విలువలు గురించి గర్భిణీలు, తల్లులకు అవగాహన కల్పించాలని ఐసీడీఎస్ పీడీ, సంయుక్త కలెక్టర్ రోజ్మాండ్ అన్నారు.
ఐసీడీఎస్ పీడీ, సంయుక్త కలెక్టర్ రోజ్మాండ్
బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు 16: పోషకాహార విలువలు గురించి గర్భిణీలు, తల్లులకు అవగాహన కల్పించాలని ఐసీడీఎస్ పీడీ, సంయుక్త కలెక్టర్ రోజ్మాండ్ అన్నారు. మండలంలో జరుగుతున్న పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ మాసోత్సవాలకు రోజ్మాండ్ ముఖ్యఅతిథిగా పాల్గొని, గర్భిణీలకు శ్రీమంతం చేసి, చీర, సారెలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారం విలువలు గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయడం కోసమే పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ అధికారి మాట్లాడుతూ మండలంలో కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన వారి సర్వే పారదర్శకంగా జరగలేదని, మళ్లీ సర్వే చేపట్టి పూర్తిస్థాయిలో బాధితులను గుర్తించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అలాగే ముగ్గురు అంగన్వాడీ కార్యకర్తలకు అసంఘటిత కార్మికులుగా గుర్తింపు కార్డులు పంపిణీ చేయడంతోపాటు 72మంది కార్యకర్తల పేర్లు నమోదు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ శ్రీతేజ, డీసీపీఓ సురేష్, సహాయ లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సీడీపీఓ సౌజన్య, సూపర్వైజర్లు ప్రసన్న, శారద, సునీత, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.