రెడ్జోన్లుగా మాచర్ల, కారంపూడి
ABN , First Publish Date - 2020-04-02T09:13:26+05:30 IST
పల్నాడు పరిధిలోని మాచర్ల, కారంపూడిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించినట్లు రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు.
గుంటూరు, ఏప్రిల్ 1: పల్నాడు పరిధిలోని మాచర్ల, కారంపూడిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించినట్లు రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు. బుధవారం ఆయన రూరల్ జిల్లా పరిధిలోని పోలీసు అధికారులతో సెట్కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వారు ఇంకా ఎవరైనా ఉంటే వారు, వారి కుటుంబసభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కారంపూడిలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఒప్పిచర్ల మసీదులో జరిగిన ప్రార్థనలకు హాజరయ్యారని ఈ క్రమంలో ఆ ప్రాంతవాసులు కూడా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆయా పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, కరోనా లక్షణాలు కనిపించినా 104, 1902, డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. రెడ్జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.