6 రోజూ 50,000 కేసులు!
ABN , First Publish Date - 2020-08-05T07:46:07+05:30 IST
కరోనా మహమ్మారి ప్రముఖులను వణికిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్షాకు వైరస్ సోకగా.. తాజాగా మరో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కూ పాజిటివ్
- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు పాజిటివ్
- కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యకు కూడా
- ఒక్కరోజులో 52,050 పాజిటివ్లు
- దేశవ్యాప్తంగా 803 మంది మృతి
- మొత్తం కేసులు 18.55 లక్షలు
- 82 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే!
- కోలుకున్న వారు 12.30 లక్షలు
- 66.31 శాతానికి చేరిన రికవరీ
- 2.1 శాతానికి తగ్గిన మరణాల రేటు
- ఒక్క రోజే 6.61 లక్షల టెస్టులు
న్యూఢిల్లీ, ఆగస్టు 4: కరోనా మహమ్మారి ప్రముఖులను వణికిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్షాకు వైరస్ సోకగా.. తాజాగా మరో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కూ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన మంగళవారం గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే కొవిడ్-19 పాజిటివ్గా తేలిన కర్ణాటక సీఎం యడియూరప్ప ఆస్పత్రి నుంచే ఫైళ్లను పరిశీలిస్తున్నారు. కాగా.. దేశవ్యాప్తంగా మంగళవారం (గడిచిన 24 గంటల్లో) కొత్తగా 52,050 కేసులు నమోదయ్యాయి. వరసగా ఆరో రోజూ పాజిటివ్ల సంఖ్య 50 వేలు దాటాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 18,55,745కి చేరింది. ఒక్క రోజులోనే 803 మంది మృత్యువాత పడగా.. మొత్తం మరణాల సంఖ్య 38,938కి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 12,30,509కి చేరింది. ప్రస్తుతం 5,86,298 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 66.31 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరణాల రేటు 2.10 శాతానికి తగ్గినట్లు తెలిపింది. ఈ నెల 2 నాటికి దేశవ్యాప్తంగా 2.08 కోట్ల టెస్టులు పూర్తి చేసినట్లు వివరించింది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6,61,892 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. ఢిల్లీలో మంగళవారం కొత్తగా 674 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1.39 లక్షలకు చేరింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేల కంటే తక్కువకు చేరింది.