ఆ సమయం ఎప్పుడు?
ABN , First Publish Date - 2021-05-05T09:05:23+05:30 IST
ఐపీఎల్ను వాయిదా వేశారు. అయితే, మిగిలిన మ్యాచ్లను ఎప్పుడు పూర్తి చేస్తారనేది పెద్ద సందేహంగా మారింది. అందుకు తగిన విండో దొరుకుతుందా?
న్యూఢిల్లీ: ఐపీఎల్ను వాయిదా వేశారు. అయితే, మిగిలిన మ్యాచ్లను ఎప్పుడు పూర్తి చేస్తారనేది పెద్ద సందేహంగా మారింది. అందుకు తగిన విండో దొరుకుతుందా? అంటే అది కష్టమేననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత విదేశీ ఆటగాళ్లను వారి ఇళ్లకు క్షేమంగా చేర్చే బాధ్యత తమదని బీసీసీఐ హామీ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడే అవకాశాలైతే ఏ కోశానా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఏదో ఒక నిర్ణయాన్ని తేల్చిచెప్పాల్సి ఉంటుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ మధ్య జూలైలోనే టీమిండియా ఆటగాళ్లకు కొంత ఖాళీ సమయం లభిస్తుంది.
కానీ, ఆ కొద్ది సమయంలోనే అంతా చక్కబెట్టడం సాధ్యం కాదు. ఇక మిగిలింది టీ20 వరల్డ్కప్ ముందు సెప్టెంబరులో న్యూజిలాండ్తో స్వదేశంలో సిరీస్. అంటే సెప్టెంబరులో తగిన సమయం దొరికే అవకాశం ఉంది. ఆ విండోలోనే వాయిదా పడిన ఐపీఎల్ను పూర్తి చేసేందుకు బీసీసీఐకి వెసులుబాటు చిక్కుతుంది. మరి ఈ సమయాన్ని బోర్డు ఎలా సమన్వయం చేసుకొంటుందో చూడాలి.