‘ట్రస్మా’తో ప్రాక్టికల్లీ సొల్యూషన్స్ భాగస్వామ్యం
ABN , First Publish Date - 2021-06-11T10:08:37+05:30 IST
తెలంగాణలోని గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా)తో అభ్యాస ఎడ్టెక్ సొల్యూషన్స్, ప్రాక్టికల్లీ స్కూల్ సొల్యూషన్ సంస్థలు అవగాహన
హైదరాబాద్ సిటీ, జూన్ 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా)తో అభ్యాస ఎడ్టెక్ సొల్యూషన్స్, ప్రాక్టికల్లీ స్కూల్ సొల్యూషన్ సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరోనా వేళ విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 10 వేలకు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు, 33 లక్షల మంది విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలను ‘ప్రాక్టికల్లీ’ యాప్ ద్వారా సులభతరం చేసేందుకు, విషయ పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం ట్రస్మా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో ప్రాక్టికల్లీ సంస్థ కో ఫౌండర్ చారు నోహిరియా మాట్లాడారు. తమ సంస్థ తరుచుగా ఉపాధ్యాయులకు శిక్షణ సదస్సులను నిర్వహిస్తుండడంతో పాటు డిజిటల్ ఉపకరణాలను వినియోగించడంలో సహాయపడుతోందన్నారు. ప్రాక్టికల్లీ యాప్లోని అంశాలు సులువుగా అర్థం చేసుకునేందుకు దోహదపడతాయని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు అన్నారు.