ఆ అలవాటు పోవాలంటే కాస్త ప్రాక్టీస్ చేయాల్సిందే
ABN , First Publish Date - 2020-05-22T10:18:36+05:30 IST
క్రికెట్లో బంతికి ఉమ్మి రాయడం ఆటగాళ్లకు ఒక అలవాటుగా మారిందని, అది మానడానికి కాస్త ప్రాక్టీస్ అవసరమని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. బౌలర్లు ఈ కొత్త పద్ధతికి అలవాటుపడాలని సూచించాడు
న్యూఢిల్లీ: క్రికెట్లో బంతికి ఉమ్మి రాయడం ఆటగాళ్లకు ఒక అలవాటుగా మారిందని, అది మానడానికి కాస్త ప్రాక్టీస్ అవసరమని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. బౌలర్లు ఈ కొత్త పద్ధతికి అలవాటుపడాలని సూచించాడు. కొవిడ్-19 విజృంభణ కారణంగా బంతికి ఉమ్మి రాయడాన్ని నిషేధించాలని అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ ఐసీసీకి ప్రతిపాదించింది. ‘మైదానంలో బౌలర్లు సహజంగానే బంతికి ఉమ్మిరాస్తారు. అలా చేయకుండా ఉండాలంటే కాస్త ప్రాక్టీస్ అవసరం. అయితే అందరూ కొత్త విధానాన్ని అలవాటు చేసుకోవాలి.’ అని అశ్విన్ తెలిపాడు. కరోనా భయంతో క్రికెట్లో సంబరాలు చేసుకొనే పద్ధతి కూడా మారిపోతుందని, ఇకమీదట హత్తుకోవడాలు, హై-ఫైవ్ ఉండక పోవచ్చని అన్నాడు. ‘పూర్వం రోజుల్లో వికెట్ పడ్డప్పుడు ఫీల్డర్లు తమ స్థానాల్లోనే నిల్చుని చప్పట్లు కొట్టేవారు. మళ్లీ పాత అలవాట్లకు మారాల’ని అన్నాడు.