కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు, ప్రజల లేఖ

ABN , First Publish Date - 2021-08-25T17:52:01+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టును అధికారిక ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్చాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతాంగం, ప్రజానీకం లేఖ రాసింది.

కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు, ప్రజల లేఖ

ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టును అధికారిక ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్చాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతాంగం, ప్రజానీకం లేఖ రాసింది. సాగు, త్రాగు నీటి అవసరాల కోసం ప్రకాశం జిల్లా ప్రజానీకం, రైతాంగం ఏళ్ల తరబడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్‌‌లో వెలిగొండ ప్రాజెక్టుని అనుమతులు లేని ప్రాజెక్టుగా చూపించారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న/ పూర్తయిన అయిదు ప్రాజెక్టులను మాత్రమే విభజన చట్టంలో ఉన్నట్టు ఈ గెజిట్‌లో పేర్కొన్నారని...ఇది విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని చెప్పారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌, సెక్షన్‌ 85(7ఈ)లో హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడులను పేర్కొన్నారన్నారు. జాబితా నుంచి ‘‘వెలిగొండ’’ను తొలగించి అనుమతిలేని ప్రాజెక్టుగా ‘‘అన్‌ అప్రూవ్డ్‌’’ విభాగంలో చూపించడం అన్యాయమన్నారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న 50 జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటని తెలపారు. వర్షాల్లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే కేంద్రం గెజిట్‌‌లో చేర్చాలని కోరారు. ‘‘మిమ్మల్ని కలిసి సమస్యను విన్నవించుకునేందుకు మాకు సమయం కేటాయించాలని కోరుకుంటున్నాం’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-08-25T17:52:01+05:30 IST