ఏయూ వీసీగా ప్రసాదరెడ్డి?
ABN , First Publish Date - 2020-11-22T06:03:02+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉప కులపతి ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కివచ్చింది. వీసీ ఎంపిక కోసం నియామకమైన సెర్చ్ కమిటీ ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి అందజేసింది.
ముగ్గురి పేర్లను అందించిన సెర్చ్ కమిటీ
ప్రస్తుత ఇన్చార్జ్ వీసీ వైపే మొగ్గు చూపించిన ప్రభుత్వం
గవర్నర్కు సిఫారసు
నెలాఖరులోగా అధికారికంగా ప్రకటన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉప కులపతి ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కివచ్చింది. వీసీ ఎంపిక కోసం నియామకమైన సెర్చ్ కమిటీ ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి అందజేసింది. అందులో ఒకరి పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రక టించే అవకాశం ఉంది. వీసీ పదవికి మొదటి నుంచీ ప్రస్తుతం ఇన్చార్జిగా ప్రసాదరెడ్డే పేరే ప్రముఖంగా వినిపిం చింది. అయితే మధ్యలో మరికొంతమంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ వీసీగా వస్తారని, ప్రసాదరెడ్డికి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. చివరికి ప్రస్తుతం ఇన్చార్జ్ వీసీగా వున్న ప్రసాదరెడ్డి వైపే ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. విశాఖలో అధికార పార్టీకి పెద్ద దిక్కుగా వున్న ప్రముఖుడి సూచనలతో వీసీ ఎంపిక జరిగినట్టు తెలిసింది.
దళిత ఆలోచన వెనక్కి..
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్గా దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ను నియమించాలని మొదట్లో ప్రభుత్వ పెద్దలు భావించారు. అందులో భాగంగా ఐఐఐటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్ల పేర్లు పరిశీలించి, ఒకరిని వైస్ చాన్సలర్గా నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే...ఏమైందో ఏమో కానీ అప్పట్లో వీసీ నియా మకానికి నియమించిన సెర్చ్ కమిటీని రద్దు చేసి..మరోసారి కొత్త కమిటీని ప్రభుత్వం నియమించి..ప్రక్రియను మొదటికి తీసుకువచ్చింది. కొత్తగా నియామకమైన కమిటీ సుమారు తొమ్మిది నెలల తరువాత ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సూచించింది. వీరిలో ఒకరి పేరును ప్రభుత్వం ఫైనల్ చేసి గవర్నర్కు పంపించినట్టు చెబుతున్నారు. అన్నీ, సవ్యంగా సాగితే ఈ నెలాఖరు నాటికి వీసీ పేరును ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.