దూరదర్శన్కు పాకిస్థాన్లో పెరుగుతున్న ఆదరణ
ABN , First Publish Date - 2021-12-19T19:49:54+05:30 IST
భారత దేశ మీడియా ప్రసార భారతి డిజిటల్ ఛానళ్ళకు మన దేశంతోపాటు
న్యూఢిల్లీ : భారత దేశ మీడియా ప్రసార భారతి డిజిటల్ ఛానళ్ళకు మన దేశంతోపాటు విదేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అయితే పాకిస్థాన్లో వీటికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. కేంద్ర సమాచార, ప్రసార (ఐ అండ్ బీ) మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్తోపాటు అమెరికా, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రేక్షకులు ప్రసార భారతి డిజిటల్ చానల్స్ను బాగా ఆదరిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో 2021లో నేపాలీ ప్రేక్షకులు కూడా పెరిగారు.
ప్రసార భారతి యూట్యూబ్ చానళ్ళకు పాకిస్థాన్ నుంచి 2018లో 64 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది 2020లో 1.33 కోట్లకు పెరిగింది. ఈ ఏడాదిలో నవంబరు 30 వరకు 1.30 కోట్ల వ్యూస్ వచ్చాయి. భారత దేశం తర్వాత ఈ డిజిటల్ చానల్స్ను అత్యధికంగా వీక్షిస్తున్నది పాకిస్థానీలే.
ఆలిండియా రేడియో (ఏఐఆర్), దూరదర్శన్ చానళ్ళను 2018లో 52.26 లక్షల మంది అమెరికన్ యూట్యూబ్ యూజర్లు వీక్షించారు. యూఏఈలో 2018లో 37 లక్షల వ్యూవర్షిప్ రాగా, ఇది 2020లో 82.72 లక్షలకు పెరిగింది.
ప్రసార భారతికి 170కిపైగా యూట్యూబ్ చానళ్ళు ఉన్నాయి. ఆలిండియా రేడియో, దూరదర్శన్ నెట్వర్క్ కార్యక్రమాలు వీటిలో ప్రసారమవుతాయి.
ఓ ప్రశ్నకు సమాధానంగా సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో మాట్లాడుతూ, ప్రసార భారతి తన ఆడియో, వీడియో డిజిటల్ చానల్స్కు ఆదరణ పెంచుకునేందుకు అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు.