రాహుల్ గాంధీని కలిసిన ప్రశాంత్ కిషోర్

ABN , First Publish Date - 2021-07-13T21:59:34+05:30 IST

కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఫ్రంట్ ఏర్పాడుతుందని, కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయ ఫ్రంట్

రాహుల్ గాంధీని కలిసిన ప్రశాంత్ కిషోర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం కలిశారు. ఢిల్లీలోని రాహుల్ నివాసానికి స్వయంగా వెళ్లి కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో పీకే చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు.


కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఫ్రంట్ ఏర్పడుతుందని, కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా మరికొంత మంది నేతలు వ్యాఖ్యానించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే రాహుల్‌ను పీకే కలిశారని ఓ వైపు వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీని పీకే ప్రశంసించడం, భవిష్యత్ నేత రాహులేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి.


బీజేపీయేతర పార్టీలు కొన్ని కొద్ది రోజులుగా ఢిల్లీలో సమావేశమవుతున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలో ఇప్పటికే మూడుసార్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నప్పటికీ.. అధిష్టానం దీనిపై స్పందించలేదు. పీకే కొంత కాలంగా బీజేపీయేతర పక్షాలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తూ వస్తున్నారు. ప్రతిపక్ష నేతలతో తరుచూ సమావేశమవుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తాను ఇప్పుడు చేస్తున్న పనిని వదిలేస్తానని ప్రకటించినప్పటికీ పవార్, రాహుల్ గాంధీలతో తరుచూ సమావేశమవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికే ప్రస్తుతం చేస్తున్న పనిని పీకే పక్కనపెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-07-13T21:59:34+05:30 IST