పీఆర్సీ భేటీపై పీటముడి!

ABN , First Publish Date - 2021-01-07T08:19:33+05:30 IST

పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ సమావేశమయ్యే అంశం ఎటూ తేలడం లేదు. ఇప్పటివరకూ తమకు ఎలాంటి సమాచారం, స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు

పీఆర్సీ భేటీపై పీటముడి!

6,7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని సీఎంవో ఆదేశం

బుధవారం త్రిసభ్య కమిటీతో జరగని భేటీ.. నేడు ఉంటుందో? ఉండదో? 

రేపు జరిగే అవకాశం ఉందని సమాచారం.. సంఘాల నేతలకు అందని నివేదిక

పదోన్నతులకూ వెలువడని మార్గదర్శకాలు.. సీఎస్‌తో భేటీకి నేతల యోచన


హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ సమావేశమయ్యే అంశం ఎటూ తేలడం లేదు. ఇప్పటివరకూ తమకు ఎలాంటి సమాచారం, స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో సమావేశం నిర్వహించాలని సీఎంవో ఆదేశించినా.. ఎలాంటి పురోగతి లేకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకూ పీఆర్సీ నివేదికను చేతికివ్వకపోవడం, పదోన్నతుల మార్గదర్శకాలు జారీ చేయకపోవడం, నిర్వహిస్తామన్న సమావేశంపై స్పష్టత ఇవ్వకపోవడంతో సంఘాల నేతలు సందిగ్ధంలో పడ్డారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందజేసి, 6, 7 తేదీల్లో సమావేశాన్ని నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌  నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని సీఎంవో ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పటివరకూ పీఆర్సీ నివేదికను అందజేయలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. కనీసం సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో తేదీని కూడా ప్రకటించలేదని వాపోతున్నారు. 6వ తేది గడిచిపోయిందని, 7న సమావేశం ఉంటుందో? లేదో? ఇప్పటిదాకా సమాచారం అందలేదని టీఎన్జీవో నేతలు చెప్పారు.


గురువారం కూడా ఎలాంటి సమాచారం అందకపోతే... సీఎ్‌సను కలవాలన్న యోచనలో వారు ఉన్నారు. అయితే... ఈ నెల 8న ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉండొచ్చని తెలిసింది. ఈ మేరకు ఓ కీలక సంఘానికి సూచన ప్రాయంగా కబురు అందినట్లు సమాచారం. సమావేశం ఎప్పుడు నిర్వహించినా... రాష్ట్రంలోని గుర్తింపు సంఘాలన్నింటినీ పిలవాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీజీవో, టీఎన్జీవో, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, జంట నగరాల డ్రైవర్ల సంఘం, ట్రెసా, సచివాలయ ఉద్యోగుల సంఘం, టీఎస్‌ హెడ్‌మాస్టర్ల సంఘం, టీఎ్‌సయూటీఎఫ్‌, టీఎ్‌సపీఆర్‌టీయూ, టీఎ్‌సఎ్‌సటీయూ తదితర గుర్తింపు సంఘాలున్నాయి. ఈ సంఘాల ప్రతినిధులందరినీ ఆహ్వానించి పీఆర్సీ నివేదికపై చర్చించాలని కోరినట్లు టీన్జీవో నేత ఒకరు తెలిపారు. 


పదోన్నతుల మార్గదర్శకాలేవి?

పదోన్నతులకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు వెలువడకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 31 లోపు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా... ఇంకా మార్గదర్శకాలు విడుదల కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఉన్న నిబంధన ప్రకారం ఏదైనా ఒక కేటగిరీ పోస్టులో మూడేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న ఉద్యోగులే పదోన్నతులకు అర్హులవుతారు. దీనిని మార్చేసి రెండేళ్ల సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలన్న ప్రతిపాదన ఉంది. దీనిపై ఉద్యోగ సంఘాలతోపాటు మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ కూడా సీఎ్‌సను కలిసి విజ్ఞప్తి చేశారు. రెండేళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఎక్కువ మందికి పదోన్నతులు లభిస్తాయని, ఖాళీలు కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందని వివరించారు. దీంతో రెండేళ్ల సీనియారిటీ ఫైలును సిద్ధం చేసి సీఎం ఆమోదం కోసం పంపించారు. ఏ శాఖలో ఎంత మందికి పదోన్నతులు లభిస్తాయి?తద్వారా ఎన్ని ఖాళీలు ఏర్పడతాయన్న వివరాలను పొందుపర్చారు. 


ఉపాధ్యాయ పదోన్నతుల్లోనే సమస్యలు

ఉపాధ్యాయ పదోన్నతుల్లోనే ఎక్కువ ఆటంకాలున్నాయని చెబుతున్నారు. గతంలో 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా పదోన్నతులు కల్పించారు. కానీ... ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలున్నాయి. మొదట్లో 31 జిల్లాలనే ఏర్పాటు చేసినప్పటికీ... ఆ తర్వాత ములుగు, నారాయణపేటను కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే... 31 జిల్లాలకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులకు మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపింది. సాధారణంగా ఉపాధ్యాయ పోస్టులన్నీ జిల్లా కేడర్‌ పోస్టులే.జిల్లాను యూనిట్‌గా తీసుకుని సీనియారిటీని పరిగణిస్తారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో సర్వీస్‌ రూల్స్‌ను మార్చాల్సి ఉంటుంది. ఒక జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయుడిని ఏ జిల్లా స్థానికుడిగా పరిగణించాలో స్పష్టత లేదు. ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలు ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం గ్రామస్థుడైన ఉపాధ్యాయుడు వికారాబాద్‌లో పని చేస్తుంటే... ఆయనను ఏ జిల్లా స్థానికుడిగా గుర్తించాలన్న అంశంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.


ఇలా స్థానికత సర్వీసు రూల్స్‌ను మారుస్తూ పదోన్నతుల మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు వివరిస్తున్నాయి. అప్పుడు ఆయా జిల్లాల వారీగా ఏర్పడే ఖాళీలు, లభించాల్సిన పదోన్నతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అంటున్నాయి. అంతేకాదు... భాషా పండింతులు, వ్యాయామ ఉపాధ్యాయుల విషయంలోనూ సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో 10,479 భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ పదోన్నతులపై భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులతోపాటు ఎస్జీటీల మధ్య వివాదం నడుస్తోంది. తమకంటే తమకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది. మార్గదర్శకాలు వెలువడితేనే ప్రభుత్వం నిర్దేశించిన 31వ తేదీలోపు పదోన్నతులు కొలిక్కి వస్తాయని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-01-07T08:19:33+05:30 IST