వారం పది రోజుల్లో పీఆర్‌సీ!

ABN , First Publish Date - 2021-12-04T07:33:22+05:30 IST

వారం పది రోజుల్లో పీఆర్‌సీని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న సరస్వతీ నగర్‌లో

వారం పది రోజుల్లో పీఆర్‌సీ!

ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి.. 

తిరుపతిలో నినాదాలు చేసిన రిటైర్డ్‌ ఉద్యోగులకు హామీ


తిరుపతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): వారం పది రోజుల్లో పీఆర్‌సీని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న సరస్వతీ నగర్‌లో శుక్రవారం ఉదయం ఆయన పర్యటిస్తుండగా.. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగులు కొందరు గుంపుగా నిలబడి పీఆర్‌సీ.. పీఆర్‌సీ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాంతో ఆగిన ముఖ్యమంత్రి వారివైపు తిరిగి ముందుకొచ్చి మాట్లాడాలని సూచించారు. రిటైర్డ్‌ ఉద్యోగులు ఎన్‌.వేణుగోపాల్‌, కోటేశ్వరరావు ముందుకొచ్చి పీఆర్‌సీని త్వరగా ప్రకటించాలని కోరారు. స్పందించిన జగన్‌ వారం పది రోజుల్లో ప్రకటిస్తామని సమాధానమిచ్చి ముందుకు కదిలారు. వేతన సవరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కార్యాచరణకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై తిరుపతిలో ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడగా.. ముఖ్యమంత్రిని తమ నేతలెవరూ కలవలేదని, ఆయనకు ఎలాంటి వినతి పత్రాలూ సమర్పించలేదని స్పష్టం చేశారు. తమ సంఘాల రాష్ట్ర నేతలు నిర్ణయించిన మేరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు.

Updated Date - 2021-12-04T07:33:22+05:30 IST